మగధీర మొదట హీరో రామ్ చరణ్ కాదా? ఆ హీరో ఒప్పుకుని ఉంటే చరిత్రే మారిపోయేది!
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ వద్ద విజయాలు మాత్రమే అందుకుంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర'ముందువరుసలో ఉంటుంది. 2009లో విడుదలైన ఈ సినిమా కేవలం రామ్ చరణ్ కెరీర్ను మాత్రమే కాదు.. తెలుగు సినిమా మార్కెట్ను అమాంతం పెంచేసింది.
దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా రామ్ చరణ్ అరుదైన ఘనత సాధించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకారం.. 'మగధీర' కథ అసలు రామ్ చరణ్ కోసం పుట్టలేదు. ఈ కథ వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎన్నో ఏళ్ల క్రితమే "ఒక్కడే వందమందిని ఎదుర్కొని యుద్ధం చేసే వీరుడు" అనే పవర్ పుల్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తన మదిలో మెదిలిందని చెప్పారు. ఆ సీన్ తోనే 'మగధీర'కు బీజం పడిందని తెలిపారు.
మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం 'జగదేక వీరుడు' తరహాలో ఒక భారీ కథను రూపొందించే ప్రయత్నం జరుగుతుండగా ఈ ఆలోచన పుట్టిందట. అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం విజయేంద్ర ప్రసాద్ మనసులో అలాగే ఉండిపోయిందట. ఇక 'సింహాద్రి' సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి కెరీర్ మరో స్థాయికి చేరుకుంది. అదే సమయంలో రాజమౌళి-చిరంజీవి కాంబినేషన్పై కూడా చర్చలు జరిగాయని విజయేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.
ఒక సందర్భంలో చిరంజీవికి ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ను వినిపించగా ఆయనకు అది చాలా బాగా నచ్చిందని తెలిపారు. నిర్మాత విజయ బాపినీడు ద్వారా చిరంజీవిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న విజయేంద్ర ప్రసాద్.. ఆ కథపై మెగాస్టార్ ఆసక్తి చూపారని చెప్పారు. అయితే పూర్తి కథ అప్పటికి సిద్ధంగా లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని వెల్లడించారు. ఒకవేళ ఆ సినిమా అప్పుడు పట్టాలెక్కి ఉంటే, 'మగధీర'లో చిరంజీవినే చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. రామ్ చరణ్ హీరోగా రెండో సినిమా ప్లాన్ చేస్తున్న సమయంలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఆ పాత ఆలోచనను తిరిగి బయటకు తీశారట. ఇప్పటికే సిద్ధంగా ఉన్న '100 మంది యోధులతో పోరాటం' అనే అద్భుతమైన ఎపిసోడ్ను కేంద్రంగా తీసుకుని మొత్తం కథను అల్లడం ప్రారంభించారట. ఇలా ఒకే ఒక్క సీన్ చుట్టూ పునర్జన్మల ప్రేమకథ, రాజ్యాలు, యుద్ధాలు, ప్రతీకారం, భావోద్వేగాలను జోడించి 'మగధీర' అనే మహాకావ్యాన్ని రూపొందించినట్టు తెలిపారు.
ముఖ్యంగా సినిమాలోని 100 మంది యోధులతో కాలభైరవ పోరాడే సన్నివేశం నేటికీ తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమ యాక్షన్ సీక్వెన్స్లలో ఒకటిగా నిలిచింది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. రాజమౌళికి కేవలం ఫైట్లు అంటే ఇష్టం కాదు. ఫైట్ వెనుక స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండాలని ఆయన నమ్ముతారని తెలిపారు. అందుకే 'మగధీర'లో ప్రతి యాక్షన్ సీన్ ప్రేక్షకులను కేవలం విజువల్గా కాకుండా భావోద్వేగపరంగా కూడా కదిలించింది. మిత్రవింద కోసం కాలభైరవ చేసే పోరాటం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
మగధీర విజయం తర్వాత రామ్ చరణ్ స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోవైపు రాజమౌళి కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగు సినిమా మార్కెట్ను విస్తరించిన చిత్రాల్లో 'మగధీర' కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ చిత్రాలకు కూడా ఈ సినిమా ఓ పునాది వేసిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఒక చిన్న ఇంటర్వెల్ సీన్ ఆలోచనగా మొదలైన కథ.. చివరకు తెలుగు సినిమా చరిత్రలోనే భారీ బ్లాక్ బస్టర్ మూవీగా మారడం నిజంగా విశేషం.
ముఖ్యంగా ఈ కథ మొదట చిరంజీవి కోసం అనుకున్నారనే విషయం ఇప్పుడు అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవేళ అప్పట్లో ఆ ప్రాజెక్ట్ మెగాస్టార్తోనే తెరకెక్కి ఉంటే.. తెలుగు సినిమా చరిత్రలో మరో కొత్త అధ్యాయం రాసి ఉండేదేమో అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.


Click it and Unblock the Notifications






