మహేష్ బాబు పన్ను ఎగవేతదారు కాదంటున్న లీగల్ టీమ్, ఏం జరిగిందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన బ్యాంక్ అకౌంట్స్ జీఎస్టీ కమిషనరేట్ సీజ్ చేసిన వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి టాక్స్ ఎగ్గొట్టారు అనే వార్తలు వెలువడటంతో అంతా షాకయ్యారు.
2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లించలేదంటూ అధికారులు ఆయన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంపై మహేష్ బాబు లీగల్ టీమ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మహేష్ బాబు పన్ను ఎగవేతదారు కాదని స్పష్టం చేసింది.

అది టాక్సబుల్ అంబాసిడర్ సర్వీస్ కాదు...
జీఎస్టీ కమిషనరేట్ వివాదాస్పదంగా కోర్టు పరిధిలో ఉన్న 2007-08 నాటి రూ.18.5 లక్షల సేవా పన్ను వడ్డీ, పెనాల్టీతో కలిపి రూ.73.5 లక్షలుగా నిర్ణయించి మహేష్ బాబు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి 2007-08 ఆర్థిక సంవత్సరంలో అంబాసిడర్ సర్వీసెస్కు ఈ పన్ను వర్తించదు. ఆ సమయంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి పన్ను పరిధిలోకి రాదని మహేష్ బాబు లీగల్ టీమ్ స్పష్టం చేసింది.

పని పరిధిలోకి అప్పటి నుంచే
అంబాసిడర్ సర్వీసెస్ని పన్ను పరిధిలోకి సెక్షన్ 65 (105) ద్వారా 01-07-2010 నుంచి చేర్చారు. కాబట్టి 2007-08 నాటి రూ.18.5 లక్షల సేవా పన్నుపై వివాదం నడుస్తోందని, ఇది కోర్టు పరిధిలో ఉందని తెలిపారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా
పన్ను చెల్లించే వ్యక్తి చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించారని మహేష్ బాబు లీగల్ టీమ్ వెల్లడించారు.

ఎగవేతదారు కాదు, పన్నులన్నీ సక్రమంగా చెల్లిస్తున్నారు
మహేష్ బాబు చట్టానికి కట్టుబడే ఉండే వ్యక్తి. ఒక బాధ్యత గల పౌరుడిగా తన చెల్లించాల్సిన పన్నులన్నింటినీ సరైన సమయంలో చెల్లించారు. ఆయన ఎగవేతదారు కాదు అని లీగల్ టీమ్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











