బ్రాండ్ ప్రమోటర్గా మహేష్ బాబు.. యాడ్స్తో సంపాదన ఎన్ని కోట్లో తెలుసా?
సూపర్స్టార్, నటశేఖర కృష్ణగారి అబ్బాయిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. తన నటన, ప్రతిభతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మహేశ్. టాలీవుడ్లోని అగ్ర హీరోలలో ఒకరిగా.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండే మహేశ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకోవడం, ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు రావడం కలకలం రేపుతోంది.
బాలనటుడిగా నీడ అనే సినిమాలో నటించి ప్రశంసలు దక్కించుకున్న మహేశ్ బాబు ఆ తర్వాత తండ్రి కృష్ణ, అన్నయ్య రమేశ్ బాబుతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. అయితే చదువు మీద దృష్టి పెట్టాలని తండ్రి సూచించడంతో సినిమాలకు బ్రేక్ చెప్పి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అశ్వినీదత్ నిర్మాతగా, కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రం ద్వారా తెలుగుతెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రోటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా తండ్రి బాటలోనే వైవిధ్యమైన చిత్రాలతో మహేశ్ ఆకట్టుకున్నారు.

మురారి, నాని, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం సినిమాలతో రికార్డుల్ని తిరగరాశాడు. విక్టరీ వెంకటేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి తెలుగునాట మళ్లీ మల్టీస్టారర్స్ ట్రెండ్స్కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కన్న ఎస్ఎస్ఎంబీ 29 ద్వారా రికార్డుల్ని తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు మహేశ్.
గ్రీకు వీరుడు లాంటి కటౌట్, కోట్లాది మంది అభిమాన గణం ఉన్న మహేశ్ బాబు సినిమాలతో పాటు బిజినెస్మెన్గానూ సక్సెస్ అయ్యారు. ఏఎంబీ సినిమాస్ పేరుతో థియేటర్స్ బిజినెస్తో పాటు రెస్టారెంట్స్ తదితర వ్యాపారాలు ఆయన నిర్వహిస్తున్నారు. తెలుగు స్టార్స్లో బ్రాండ్ అండార్స్మెంట్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేశ్ బాబు . దాదాపు డజనుకు పైగా బ్రాండ్స్కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాండ్ ప్రమోషన్ నేపథ్యంలోనే మహేశ్ చిక్కుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. సురానా గ్రూప్ అనుబంధ , సాయి సూర్య డెవలపర్స్ స్కామ్లో భాగంగా ఈడీ అధికారులు మహేశ్ బాబుకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. ఆయన తీసుకున్న పారితోషికం? దానికి చెల్లింపులపై ఈడీ విచారణ జరుపుతోంది.
ఈ నేపథ్యంలో మహేశ్ బ్రాండ్ ప్రమోషన్కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? ఒక్క సెకనుకు పారితోషికం ఎంత? అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు చూస్తే .. ఒక కంపెనీబ్రాండ్ వాల్యూ, దాని కమర్షియల్ రేంజ్ను బట్టి మహేశ్ బాబు రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుందని ఫిలింనగర్ టాక్. ఇది ఒక్క సెకనుకు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందట. గతంలో మౌంటెన్ డ్యూ కోసం మహేశ్ బాబు ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకుని ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచాడు.
మొత్తంగా ఆయన 5 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏడాదికి పదికి పైగా యాడ్స్ చేస్తే మహేశ్ రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు సంపాదిస్తారు. సినిమాలు, ఇతర వ్యాపారాలను కూడా లెక్కలోకి తీసుకుంటే మహేశ్ బాబు ఏడాది ఆదాయం రూ.200 కోట్ల పై మాటేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు.. కేవలం సోషల్ మీడియాలో ఊహాగానాలను బట్టి ఎవరికి వారు ఊహించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











