'ఆ మూవీ నా లైఫ్ ను మార్చేసింది.. వారణసితో అదే వైబ్'
సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ వారణాసి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ, ఎస్ గోపాల్ రెడ్డిలు సంయుక్తంగా వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్రాజ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. మిగిలిన టెక్నీషియన్స్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సా ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా, తమ్మిరాజు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా 1300 కోట్ల భారీ బడ్జెట్తో వారణాసి తెరకెక్కుతోన్నట్లు ఫిలింనగర్ టాక్.
హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్షన్
తన సినిమాలకు ఎలా హైప్ తీసుకురావాలో? ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీలు వాడాలో రాజమౌళికి తెలిసినంతగా ఎవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. ఏప్రిల్ 7, 2027న వారణాసి సినిమా విడుదల చేస్తున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. మరో ఏడాదిలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు రాజమౌళి. దీనిలో భాగంగా వారణాసిపై అంతర్జాతీయ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చింది చిత్ర యూనిట్. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

15 ఏళ్ల క్రితమే రాజమౌళితో చేయాల్సింది
15 ఏళ్ల క్రితమే రాజమౌళి దర్శకత్వంలో నేను సినిమా చేయాల్సింది. పలు కారణాలతో అది ఆలస్యమైంది. ఆర్ఆర్ఆర్ ముగిసిన తర్వాత వారణాసి స్క్రిప్ట్పై రాజమౌళి కసరత్తు ప్రారంభించారు. ఓ రోజున ఆఫీసుకి పిలిపించి స్క్రిప్ట్ వివరించారు. రాజమౌళి ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలకు భిన్నంగా ఈ స్క్రిప్ట్ ఉంది. యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైమ్ ట్రావెల్ సహా ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో హీరోగా చేయాలంటే భయం వేసింది. కానీ రాజమౌళి అన్ని రకాలుగా నాలోని భయాన్ని పొగొట్టారు. ఈ సినిమాకు కావాల్సిన రిహార్సల్స్ కోసం ఏడాది పాటు కష్టపడ్డాం.. జర్మనీ కూడా ఇందుకోసం వెళ్లొచ్చాం. పర్ఫెక్షన్కు ప్రాణమిచ్చే వ్యక్తి రాజమౌళి... చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారని మహేశ్ తెలిపారు.
కొత్తగా పరిగెత్తుతా
వారణాసిలో నేను శ్రీరాముడిగా కనిపించబోతున్నా... హుందాతనానికి ఆయన ప్రతీక. శ్రీరాముడి హావభావాలు, నిలబడే విధానం అన్నింటిపై రిహార్సల్స్ చేశాం.. ఇక నేను పరిగెత్తే విధానాన్ని కూడా రాజమౌళి మార్చారు. ఇందుకోసం 6 నెలల పాటు శిక్షణ తీసుకున్నా. ఇంత పెద్ద సినిమాలో కేవలం రెండు షాట్స్ కోసం కష్టపడ్డాం, వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు అని మహేశ్ బాబు వెల్లడించారు.
పోకిరిపై మహేశ్ కామెంట్స్
ఇక ఒక నటుడిగా మిమ్మల్ని ఏ సినిమాలు మార్చాయని యాంకర్ అడగ్గా.. దానికి మహేశ్ బాబు స్పందించారు. నన్ను మార్చిన సినిమా ఇదే (వారణాసి) కానీ.. దానికి ముందు చాలా సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా మమ్మల్ని మారుస్తుంది.. నన్ను మార్చిన సినిమా అంటే పోకిరి. అది నన్ను ఒక స్టార్గా మార్చింది. కాబట్టి సహజంగానే అది నన్ను మార్చింది. ఇదంతా 2006 నాటి మాట. ఆ సమయంలో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అలా పోకిరి నా జీవితాన్ని ఎంతగానో మార్చేసింది. దాంతో నేను గందరగోళానికి గురయ్యాను. ఏం చేయాలో కూడా తెలియలేదు. ఎందుకంటే ఒక దశకు చేరుకున్నప్పుడు.. ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నా విషయంలోనూ అదే జరిగింది. ప్రతి సినిమా నన్ను మార్చినా.. ఈ సినిమాతో నేను ఇప్పుడు అనుభవిస్తున్న లాంటిది మరొకటి లేదు. ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం అన్నారు మహేశ్ బాబు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











