వలస కార్మికుల కోసం బస్సులు..రియల్ హీరో మంచు మనోజ్
ప్రస్తుతం కరోనా వైరస్ ఏ రేంజ్లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో ఇప్పటికే లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు విధించిన లాక్డౌన్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు గానీ తాజాగా నాల్గో దశలో మాత్రం కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. అందులో ముఖ్యంగా వలస కార్మికులకు సంబంధించినదే. రోడ్ల వెంట, అడవి దారిలో, రైలు పట్టాల వెంబడి వేల కిలోమీటర్ల దూరం నడుస్తూ తమ సొంత గూటికి చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఆకలి చావులకు కొందరు, ప్రమాదాలకు మరికొందరు బలైపోతోన్నారు. ఇలాంటి నేపథ్యంలో వలస కార్మికులను సురక్షితంగా తమ తమ గమ్య స్థానాలకు చేర్చడంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వాటితో పాటు మంచి మనసున్న హీరో మంచు మనోజ్ ముందుకు వచ్చాడు.

వలస కార్మికుల కష్టాలు చూసి చలించిన మనోజ్.. వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు బస్సులు నడపాలని నిర్ణయించుకున్నాడు. ఓ మంచి పని కోసం అందరి సాయం అవసరమని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించాడు. అందరూ తలో చేయి వస్తే వలస కార్మికులను ఇళ్లకు పంపొచ్చని పేర్కొన్నారు. వలస కార్మికులను ఇళ్లకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని, అనుమతి కావాలని కేంద్రాన్ని కోరగా, అనుమతించిందని మనోజ్ తెలిపాడు.
ఈ రోజు (మే 20) సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళంకు రెండు బస్సులు బయలుదేరినట్టు మనోజ్ పేర్కొన్నాడు. కార్మికులకు ఆహారం, మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్ముందు ఈ సేవలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications











