Manchu Vishnu: కన్నప్పపైనే ఆశలన్నీ.. మంచు విష్ణు చివరిగా హిట్ ఎప్పుడు కొట్టాడంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు వరుస హిట్స్తో జోరు మీదుంటే కొందరు మాత్రం ఒక్క హిట్ కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వీరిలో సీనియర్ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా ఒకరు. హిట్టు కోసం తపన పడుతున్న ఆయన ఇప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ స్టార్ క్యాస్టింగ్, స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సర్వశక్తులు ఒడ్డి కన్నప్పను విడుదల చేశారు. ఈ సినిమాపై మంచు విష్ణుయే కాదు.. మంచు ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు కెరీర్ను ఒకసారి పరిశీలిస్తే..
ఢీ చిత్రంతో బ్రేక్
1985లో రగిలే గుండెలు సినిమాలో బాలనటుడిగా కనిపించిన మంచు విష్ణు.. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2003లో విష్ణు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్నారు విష్ణు. అనంతరం సూర్యం, పొలిటికల్ రౌడీ, అస్త్రం, గేమ్ సినిమాలు చేసినా విష్ణుకు కలిసిరాలేదు. ఈ దశలో కామెడీ, ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ ఆయన కెరీర్కు బ్రేక్ ఇచ్చింది. 2007లో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.

ఒక్క హిట్.. పది ఫ్లాప్స్లా కెరీర్
ఢీ తర్వాత చేసిన కృష్ణార్జున, సలీం, వస్తాడు నా రాజు చిత్రాలు డిజాస్టర్స్గా నిలిచి మంచు విష్ణుకి షాకిచ్చాయి. ఈ దశలో దేనికైనా రెడీ చిత్రం తిరిగి ఆయనకు ఊపిరి పోసింది. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చి విష్ణు ట్రాక్లోకి వచ్చారు. తర్వాత దూసుకెళ్తా కూడా పర్వాలేదని అనిపించుకుంది. తండ్రి మోహన్ బాబు, సోదరుడు మనోజ్లతో కలిసి చేసిన పాండవులు పాండవులు తమ్మెద సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ అనంతరం విష్ణు ఎంచుకున్న కథలు రివర్స్ అయ్యాయి. అనుక్షణం, ఎర్రబస్, డైనమైట్, ఈడో రకం ఆడో రకం, లక్కున్నోడు, గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్లు, జిన్నా ఇలా ప్రతి చిత్రం నిరాశ పరుస్తూ వచ్చింది.
సినిమాలకు విష్ణు బ్రేక్
2022లో వచ్చిన జిన్నా సినిమాను విష్ణును బాగా డిజప్పాయింట్ చేసింది. పాకిస్తాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నా పేరును సినిమాకు టైటిల్గా పెట్టడంపై వివాదం రేగింది. అన్ని ఇబ్బందులను తట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ను దించినప్పటికి విష్ణుకు నిరాశే ఎదురైంది. జిన్నా రిజల్ట్తో కొన్నాళ్లు సైలెంట్ అయిన విష్ణు తన వ్యాపారాలు, ఇతర పనుల్లో బిజీ అయ్యారు. మధ్యలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగడంతో దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంటే 2014లో చివరిసారిగా తన కుటుంబంతో కలిసి నటించిన పాండవులు పాండవులు తుమ్మెద మాత్రమే ఆయనకు చెప్పుకోదగ్గ విజయం. ఇది సోలోగా అయితే 2012లో వచ్చిన దేనికైనా రెడీ చిత్రమే .. విష్ణుకు హిట్ . దీనిని బట్టి దాదాపు పుష్కరకాలంగా విష్ణుకు హిట్ లేకుండా పోయింది.
కన్నప్పపైనే ఆశలు
రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా విజయం సాధించాలని కంకణం కట్టుకున్న విష్ణు.. రిస్క్ తీసుకున్నారు. కృష్ణంరాజు కెరీర్లోనే మైలురాయిగా చెప్పుకునే భక్త కన్నప్ప సినిమాను రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే పూర్తిగా అదే కథను దించకుండా మార్పులు చేర్పులతో స్వయంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడిగా కన్నప్ప ప్రాజెక్ట్ను పట్టాలెక్కించారు. సినిమా పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ రెడీ అయినప్పుడు పలు విమర్శలు, ట్రోలింగ్ జరిగినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని కన్నప్పను నిర్మించారు విష్ణు. కొడుకు కోసం ఏకంగా రూ.120 కోట్లకు పైగా బడ్జెట్తో మోహన్ బాబు కూడా రిస్క్ చేశారు. వీరి ప్రయత్నం ఫలించి ప్రస్తుతం కన్నప్పకు పాజిటివ్ టాక్ వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











