మైత్రి మూవీ మేకర్స్ తో రవితేజ మాస్ మూవీ.. మరో సక్సెస్ఫుల్ కాంబో, డైరెక్టర్ ఎవరంటే?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడన్న విషయం తెలిసిందే. గతంలో కంటే ఇప్పుడు వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న ఈ స్టార్ హీరో.. ఇప్పటికే ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో హిట్ను అందుకున్నా.. 'రావణాసుర' మూవీతో మాత్రం భారీ డిజాస్టర్ను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వర్రావు' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైపోయింది. దీనితో పాటు రవితేజ ఇప్పుడు 'ఈగల్' అనే సినిమాను కూడా చేస్తోన్నాడు. ఈ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇవి పట్టాలపై ఉండగానే మరికొందరు దర్శకులతోనూ చర్చలు జరుపుతున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ.. 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీతోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మాస్ హీరో మరో ప్రాజెక్టును కూడా ఓకే చేసినట్లు తాజాగా తెలిసింది.
ఇప్పటికే మూడు నాలుగు ప్రాజెక్టులను ఓకే చేసుకున్న మాస్ మహారాజా రవితేజ.. గతంలో తనకు భారీ సక్సెస్ను అందించిన డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితోనూ సినిమా చేయబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే, గోపీచంద్ మలినేని - రవితేజ కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్టు 'క్రాక్'కు సీక్వెల్గా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ స్క్రిప్టు ఓకే కాకుంటే మరో కొత్త కథతోనైనా సినిమా చేయడానికి వీళ్లిద్దరూ రెడీగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి గోపీచంద్, రవితేజ కలవడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. ఇదే మాత్రం నిజమైతే అతడి ఫ్యాన్స్కు పండుగే అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











