ఒకే వేదికపై చిరు- బాలకృష్ణ.. మెగాస్టార్ను చూడగానే లేచి, ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే
దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసిస్తున్నాయి నందమూరి - మెగా కుటుంబాలు. తొలినాళ్లలో ఎన్టీఆర్ - చిరంజీవి మధ్య పోరు జరగ్గా, అన్నగారు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన నట వారసుడిగా బాలయ్య విజృంభించారు. దీంతో బాలకృష్ణ- చిరంజీవి మధ్య వార్ అనివార్యమైంది. పెద్దాయన బతికున్న రోజుల నుంచి నేటి వరకు ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకరి ఇంట్లో మంచి చెడుకు మరొకరు రావడం కొనసాగుతూనే ఉంది.
హీరోల మధ్య ఇంతటి ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పటికీ మెగా - నందమూరి అభిమానులకు మాత్రం అస్సలు పడదు. బ్యానర్లు, కటౌట్లు, పోస్టర్ల దగ్గరి నుంచి కలెక్షన్ల రికార్డుల వరకు అన్నింటిని పోల్చి చూసుకుంటూ గొడవ పడేవారు. దీనికి తోడు రెండు గ్రూప్ల సామాజికవర్గాలు వేరు వేరు కావడం ఈ ఘర్షణలకు మరింత ఆజ్యం పోసింది. తమ హీరోలు గొప్ప అంటే తమ హీరోలు గొప్ప అని కొట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా రాకతో ఇది హద్దులు మీరి వల్గర్ కామెంట్స్ చేసే వరకు వెళ్లింది.

ఫ్యాన్స్ మధ్య ఎన్ని ఉన్నా.. చిరంజీవి - బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్లు మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పుణ్యమా అని ఆర్ఆర్ఆర్లో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. అయితే ఆర్ఆర్ఆర్లో తమ హీరోకు సరిగా ఎలివేషన్స్ ఇవ్వలేదంటూ ఇక్కడా ఫ్యాన్స్ తగవు పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి కుటుంబ పార్టీ తెలుగుదేశానికి మద్ధతుగా నిలవడంతో మెగా- నందమూరి గొడవలు చాలా వరకు సద్దుమణిగాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీ - జనసేన ప్రభుత్వం ఉండటంతో రెండు గ్రూపులు కలిసి మెలిసే ఉంటున్నాయి.
ఇదిలాఉండగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని త్వరలో భారీ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఇందుకు టాలీవుడ్లోని నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అంతా కలిసిరానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లే చీఫ్ గెస్ట్లన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఈవెంట్కు రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికే ఆహ్వానం అందింది.
అయితే అంతకంటే ముందే చిరంజీవి - బాలకృష్ణలు ఒకే వేదికపై కలుసుకున్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య కుమారుడి వివాహం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ వేడుకకు విచ్చేసిన మెగాస్టార్ను చూసి కుర్చీలో కూర్చొన్న బాలకృష్ణ లేచి నిలబడి విష్ చేశారు. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకుని .. కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి రిలేషన్, బాండింగ్ దశాబ్ధాలుగా చెక్కుచెదరలేదని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఈ పెళ్లికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరైనట్లుగా సమాచారం.


Click it and Unblock the Notifications











