ధృవ సీక్వెల్ న్యూస్.. రాంచరణ్ చేస్తాడా!
తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం తాని ఒరువన్ విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు. జయం రవి హీరోగా, అరవింద్ స్వామి విలన్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్నీ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. 3 వ వార్షికోత్సవ వేడుకల్లో మోహన్ రాజా ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించడం విశేషం.
పోలీస్ అధికారిగా జయం రవి నటన, విలన్ గా అరవింద్ స్వామి తిరుగులేని పెర్ఫామెన్స్ ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణాలు. సీక్వెల్ లో జయం రవి హీరోగా నటించనున్నాడు. తొలి భాగంలో అరవింద్ స్వామి మరణిస్తాడు. దీనితో సీక్వెల్ లో ఎవరు విలన్ అనే ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉండగా తెలుగులో ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధృవ పేరుతో రీమేక్ చేశాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్ర సీక్వెల్ గురించి అభిమానుల్లో చర్చ మొదలైంది. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత రాజమౌళి చిత్రం ఉంది. ఆ తరువాతే ధృవ సీక్వెల్ గురించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











