నాన్న తర్వాత అన్నయ్యే: చెమ్మగిల్లిన కళ్లతో హరికృష్ణ గురించి బాలయ్య!
తన సోదరుడు నందమూరి హరికృష్ణ హఠాన్మరణంపై బాలయ్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. భూమ్మీద ఎంతో మంది పుడతారు గిడతారు కొందరు మాత్రమే అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకుంటారు. అన్నయ్య లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ది కావడం లేదు అంటూ చెమ్మగిల్లిన కళ్లతో బాలయ్య మాట్లాడటం అందరినీ కలిచివేసింది. అన్నయ్య హరికృష్ణ లేకపోవడం తనకు, తమ కుటుంబానికే కాదు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు.

అన్నయ్యతో గడిపిన రోజులు
నేను ‘అన్నదమ్ముల అనుబంధం' సినిమా చేసినపుడు నాన్నగారు ఆన్నయ్యను నాతో పంపించి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అన్నారు. తర్వాత అన్నయ్య నేను కలిసి రామ్ రహీమ్, తాతమ్మకల సినిమా చేయడం జరిగింది. ఆయనతో గడిపిన రోజులు ఇప్పటికీ నా కళ్లముందు మొదులుతున్నాయని బాలయ్య తెలిపారు.

ఆయనది గొప్ప వ్యక్తిత్వం, అందరితో కలుపుగోలుగా
ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది. అందరితో కలుపుగోలుగా ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరితో ఆత్మీయుడిలా మెలిగేవారు. ఆయన భౌతికంగా మన మధ్య లేక పసోయినా అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు... అని బాలయ్య అన్నారు.

ఆవేశంలో నాన్నగారిని గుర్తు చేసేవారు
ఆవేశంలో ఉన్నపుడు ఆయన అప్పుడప్పుడు నాన్నగారిని గుర్తు చేస్తుండేవారు. చిన్నతనంలో మా ఊర్లో తాతగారి దగ్గర పెరిగారు. ఊరెళ్లినపుడు అందరినీ పలకరించేవారు. ఆయన నుండి మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం అన్నారు.

నాన్నగారి తర్వాత అన్నయ్యే
అన్నయ్య ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ప్రతి సంప్రదాయానికి, బంధుత్వానికి, సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన వస్తే నాన్నగారిని చూసినట్లే అనిపించేది. ఆయన హుందాతనం, కలుపుగోలుతనం మాకు మరింత దైర్యాన్ని ఇచ్చేదని బాలయ్య తెలిపారు.

ఏదో ఒకరోజు పోవాల్సిన వారమే
ఆయన డ్రైవింగును ఇష్టపడే వారు.... ఈ రోజు అదే డ్రైవింగ్ వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ... ‘టైమ్...బాగోలేకపోతే అంతే', అందరం ఏదో ఒక రోజు పోవాల్సిన వారమే. కానీ ఇలా జరుగడం బాధారకం అని బాలయ్య అన్నారు.


Click it and Unblock the Notifications











