‘బాలకృష్ణకు ఎందుకింత పొగరు.. ఆ ధైర్యం ఎక్కడిది’
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలోకి వచ్చిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..

నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రను మరలా మరలా తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒక్కడే" అంటూ బాలయ్య చేసిన కామెంట్ వైరల్ అయింది.
అఖండ 2 చిత్రాన్ని ఆదరించి ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేనిది అని బాలకృష్ణ అన్నారు. ఆది దంపతులు శివ పార్వతులే తన తల్లిదండ్రులు. ప్రతీ ఒక్కరు సరస్వతి పుత్రులే. గురువుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి అని బాలకృష్ణ అన్నారు.
ఈ సినిమాకు తమన్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది. అఖండ సినిమా భారతీయ మూలాలు, ధర్మం, తేజస్సు కలిగిన చిత్రం. సినిమా అంటే దైనందిన జీవితంలో ఒక భాగం. నిత్యవసర వస్తువుగా మారింది. ఇండస్ట్రీలో పెద్దలు ఎలాంటి సినిమాలు తీయాలో ఆలోచించాలి. ఇప్పటి వరకు ఐదు సినిమాలతో హిట్స్ అందించారు. ఆరో సినిమా కూడా త్వరలోనే రాబోతున్నది అని బాలకృష్ణ అన్నారు.
నా వృత్తే నా దైవం. నా వృత్తే అఖండ సినిమాలోని పాత్ర. యాక్టింగ్ అంటే ఎమోషన్స్ పలికించడం, కన్నీళ్లు పెట్టించడం కాదు. పాత్రలో లీనం కావాలి. అఘోర పాత్రను ఎలా చేశానంటే.. అదంతా దైవలీల. నందమూరి తారకరామారావు నుంచి నేను నేర్చుకొన్నాను. నాకు ధన్యమైన జన్మనిచ్చిన ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన యుగపురుషుడికి నమస్కరించుకొంటున్నాను అని బాలకృష్ణ అన్నారు.
అఖండ 2 మూవీలో దేవుడు మనిషిలో పూనడం చూశాం, ఇప్పుడు మనిషే దేవుడైతే ఎలా ఉంటుందో చూపించాం. పిల్లలకు మన మూలాలు, సనాతన హైందవ ధర్మం గురించి తెలియజేయాలి. సత్యం దారిలో నడవాలి. ధర్మం కోసం పోరాడాలి అని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాలన్న మేమే. చరిత్రను తిరగరాయాలన్న మేమే. ఇందంతా పొగరుతో చెప్పేది కాదు. ఈ మాటలు చెబితే.. బాలకృష్ణకు ఎందుకింత పొగరు. ఏం చూసుకొని ఇంత పొగరు. ఎవరిని చూసుకొని ఇంత పొగరు.. ధైర్యం ఎక్కడిది అని ఉలిక్కి పడుతారు. వీడికి అన్ని తెలుసా అనుకొంటారు. ఇదంతా పొగరు కాదు. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంతా పరమేశ్వరుడి లీల అని బాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











