మా వాడు, మనోడు.. ఇండస్ట్రీలో దారుణంగా ఆ ఫీలింగ్.. నాని షాకింగ్ కామెంట్స్
హేమాహేమీలు, వారసులతో నిండి ఉన్న చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం.. ఎంట్రీ ఇచ్చినా నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. అలాంటిది గాడ్ఫాదర్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచారు నేచురల్ స్టార్ నాని. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ.. నాని సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని పరిస్ధితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాని.
అసిస్టెంట్ డైరెక్టర్ టూ యాక్టర్
డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్గా స్థిరపడ్డారు నాని. దిగ్గజ దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత అల్లరి బుల్లోడు, అస్త్రం వంటి సినిమాలకు కూడా అసిస్టెంట్గా పనిచేశాడు. అయితే హీరో అవ్వాలని నిర్ణయించుకుని డైరెక్షన్ను పక్కనపెట్టేశాడు. ఈ క్రమంలో తన స్నేహితురాలు, దర్శకురాలు నందిని రెడ్డి సాయంతో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టాచమ్మా సినిమాలో ఛాన్స్ అందుకున్న నాని.. తొలి సినిమాకే హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ది ప్యారడైజ్తో బిజీ
ఆ తర్వాత రైడ్, స్నేహితుడా, భీమిలీ కబడ్డి జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు చేస్తూ వచ్చిన నాని కెరీర్ను ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ మార్చేసింది. ఈ సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నాని. ఆ తర్వాత వరుసపెట్టి హిట్స్ అందుకుంటూ నేచురల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. భలే భలే మగాడివోయి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్లో, యువతలో క్రేజ్ దక్కించుకున్న నాని.. జర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో తన కెరీర్ గ్రాఫ్ను, మార్కెట్ను పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు నాని.
మెగాస్టార్ సినిమాకు నిర్మాతగా
హీరో కావడానికి, చిత్ర పరిశ్రమలో తను ఎదుర్కొన్న కష్టాలు ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మారారు నాని. డి ఫర్ దోపిడి, హిట్ సిరీస్, అ, కోర్ట్, మీట్ క్యూట్ సినిమాలను నిర్మించారు. త్వరలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమాను నిర్మించనున్నారు. సినిమాలతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నాని. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తోన్న జయమ్మ నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్గా వచ్చిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందరూ బాగుండాలి
చాలా మంది అంటూ ఉంటారు. మనకి ఓ రిలీజ్ వస్తుందనుకుంటే అప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి, మూడు సినిమాలు ఉన్నాయిని కాంపీటిషన్లాగా వస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా చాలామంది ఇండస్ట్రీ జనాలు, ఫ్యాన్స్ కానీ మా వాడిది ఆడాలి, వాడిది ఆడకూడదు అనుకుంటారు. ఇండస్ట్రీలో కూడా మన సినిమా ఆడాలి, ఇంకో సినిమా ఆడకూడదని అనుకుంటారు. ఎవ్వరికీ అర్ధం కానీ విషయం ఏంటంటే సినిమాలు అన్ని ఆడుతుంటే నీది ఆడుతుంది. ఏది ఆడకపోతే నీది కూడా ఆడదు.. అన్ని సినిమాలు ఆడాలని కోరుకోవాలి. నేను నా సినిమా రిలీజయ్యే ఫ్రైడే.. ఇంకో సినిమా ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చిన సినిమాలన్నీ నేను ప్రార్ధన చేసేటప్పుడు బాగా ఆడాలని కోరుకుంటా. అందరూ బాగుంటూనే మనం కూడా బాగుంటాం.. మనమే బాగుండాలని కోరుకున్నామంటే, మనం బాగుండం, ఎవరికీ కూడా మంచి జరదు. ఇలాంటి మనస్తత్వం మారాలని నాని ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











