హ్యాట్రిక్ చేయబోతున్న నితిన్: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి ఇతనొక్కడిదే ఆ ఘనత
'జయం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్. మొదటి మూవీతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ వెంటనే 'దిల్'తో భారీ హిట్ కొట్టాడు. అక్కడి నుంచి వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈ హీరో.. చాలా కాలం పాటు సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్' సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత పలు హిట్లను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దీన్ని ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.

2018లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'అంధాధున్'. హిందీలో వచ్చిన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను నితిన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు. నితిన్ 30వ సినిమాగా వస్తున్న దీన్ని జూన్ 11న రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ ఏడాది అతడు ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇందులో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లు.


Click it and Unblock the Notifications











