మానవత్వాన్ని చంపేయకూడదు.. అందుకే ప్రతీసారి నష్టపోతున్నా.. పవన్ కల్యాణ్ ఎమోషనల్
తెలుగు సినిమా పరిశ్రమలో తాను నిర్మాతల హీరోను అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిరూపించుకొన్నారు. గతంలో ఎన్నో సినిమాల విషయంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు అండగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజా రిలీజైన హరిహర వీరమల్లు సినిమాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఏపీ డిప్యూటీ సీఎం మరోసారి నిర్మాత ఏఎం రత్నంకు అండగా నిలిచారు. అయితే ఈ విషయంపై ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తనలోని భావాలను పంచుకొన్నారు. అయితే ఆయన భావోద్వేగంతో చెప్పిన విషయాల్లోకి వెళితే..
పవన్ కల్యాణ్ తన కెరీర్లో తొలిసారి నటించి దర్శకత్వం వహించిన చిత్రం జానీ. ఆ సినిమా తొలి ఆట తర్వాత డిజాస్టర్ టాక్ రావడం అందర్నీ షాక్ గురి చేసింది. తన మూలంగా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నష్టపోకూడదని వెంటనే నిర్ణయించుకొన్నారు. ఈ సినిమా వల్ల నష్టపోయిన వారిని ఆదుకోనేందుకు తాను తీసుకొన్న రెమ్యునరేషన్ను తిరిగి ఇచ్చి వారికి కలిగిన నష్టాన్ని పూడ్చారు.

ఇక ఇలా మరొకొన్ని సినిమాలకు కూడా నిర్మాతలకు అండగా నిలిచి ఆదుకొన్నారు. అయితే ఆరెంజ్ సినిమా ఫ్లాప్ కావడంతో భారీగా తన సంపాదనలోని మొత్తాన్ని నిర్మాత నాగబాబుకు ఇచ్చి ఆయనను అప్పుల్లో నుంచి బయటపడేలా చేశారు. నిర్మాతనే కాకుండా తన కుటుంబం కష్టాల్లో పడకూడదని తాను ఎన్ని కష్టాలైనా భరించి ఆర్థికంగా పెద్ద మొత్తాన్నే త్యాగం చేశారు.
అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమా కోసం తీసుకొన్న రెమ్యునరేషన్ నుంచి 11 కోట్ల రూపాయలు వెనక్కి తిరిగి ఇచ్చారు. సినిమా రిలీజ్కు ఆర్థిక సమస్యలు రావడంతో తాను ఉన్నానంటూ ముందుకు వచ్చారు. ఇలా ప్రతీసారి తాను తన పారితోషికాన్ని, సంపాదనను వదులుకొన్నారు. అదే విషయాన్ని మీడియాతో స్వయంగా పంచుకొన్నారు.
మంచో, చెడో తెలియదు కానీ.. నా పారితోషికాన్ని కోల్పోతుంటాను. కేవలం మానవత్వం కోసం కొన్నిసార్లు త్యాగం చేయాల్సి వస్తుంది. మానవత్వాన్ని చంపేయకూడదు. నేను నిర్మాతకు అండగా ఎందుకు నిలబడుతానంటే.. మనం కూర్చునే చైర్ చేయాలంటేనే హింసకు పాల్పడాలి. ఎంతో కష్టపడాలి. అలాగే సినిమా అంటే చాలా మందిని ఒప్పించాలి. వారందరిని ఏకతాటిపై నడిపించాలి. సినిమాను నిర్మించాలంటే.. పెద్ద యుద్దాన్ని చేయాల్సి వస్తుంది అని పవన్ కల్యాణ్ అన్నారు.
సినిమా అంటే కేవలం నిర్మాత మాత్రమే కాదు. ఫైనాన్షియర్స్ ఉంటారు. ఆరెంజ్ సినిమా సమయంలో ఒక్కొక్కరికి 10, 15 లక్షల చెక్కులు ఇచ్చాను. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. సినిమా వల్ల ఎవరు నష్టపోకూడదనేది నా అభిప్రాయం. నిర్మాతను చంపేయకూడదు. డబ్బు వస్తుంది.. డబ్బు పోతుంది. కానీ మానవత్వాన్ని చంపేయకూడదు అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications










