పవన్ పోరాటానికి తోడైన దైవబలం .. వారాహీ అమ్మవారు , కొండగట్టు అంజన్నను తలచుకుంటున్న జనసైనికులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అన్నింటిలోకి చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్. ఈసారి ఎన్నికలు జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా జరిగాయి. అభిమానుల పదేళ్ల నిరీక్షణ ఫలించి పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని ఘన విజయం సాధించారు. తనే కాదు తాను నిలబెట్టిన 21 మంది జనసేన అభ్యర్ధులను కూడా గెలిపించి అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు.
జనసేన పెట్టి పదేళ్లయితే , ఎమ్మెల్యేగా గెలవడానికి పవన్కు అంతే కాలం పట్టింది. తాను గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ . జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే దానిని నిలబెట్టుకున్నారు.

తొలినాళ్లలో పరిస్ధితుల దృష్ట్యా అప్పటి టీడీపీ - బీజేపీ కూటమికి జనసేనాని మద్ధతు తెలిపారు. 2019లో కూటమి నుంచి బయటకు వచ్చి లెఫ్ట్, బీఎస్పీ నేతల మద్ధతుతో పోటీ చేశారు. తాను భీమవరం, గాజువాకలలో పోటీ చేయగా.. రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. జనసేన ఓటమి కంటే పవన్ పరాజయం పాలవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు, పవర్స్టార్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ పడి లేచిన కెరటం మాదిరి ఆ క్షణం నుంచే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోరాడారు పవన్ కళ్యాణ్. ఒంటరిగా వెళితే మరోసారి నష్టం తప్పదని గ్రహించి టీడీపీ, బీజేపీలతో జత కట్టారు.
అనంతరం కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాడి వేడి ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓటంలను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. ఈ వర్గం బలంగా ఉన్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి , ఇతర జిల్లాల్లో కూటమికి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం.
ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ''వారాహీ ''. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎలాగైనా అడుగుపెట్టాలన్న కృతనిశ్చయంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయాలని సంకల్పించారు. తన యాత్రల కోసం ప్రత్యేక వాహనం ఉంటే బాగుంటుందని భావించారు. పవన్ మదిలో మెదిలిన ఆలోచనకు రూపమే 'వారాహీ' వాహనం. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలెవరికీ లేని విధంగా సైనికులు వాడే వాహనాన్ని పోలిన బస్సును సిద్ధం చేయించారు. వీఐపీలు వాడే కేరవాన్ని తన టేస్ట్కు తగ్గట్టుగా అత్యాధునిక సదుపాయాలతో మలచుకున్నారు పవన్ .

ఆ వాహనానికి 'వారాహీ' అని నామకరణం చేశారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహీ అమ్మవారు ఒకరు. లలితా దేవికి సైన్యాధ్యక్షురాలిగా ఆమెను శాస్త్రాలు పేర్కొంటాయి. యుద్ధంలో నలుదిక్కుల నుంచి కాపాడే వారాహీ అమ్మవారి పేరును తన వాహనానికి పెట్టుకున్న పవన్ కళ్యాణ్ .. ఆమె ఆశీస్సులతో ఎన్నికల రంగంలోకి దూకారు. తెలంగాణలోని తనకు ఎంతో ఇష్టమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి వారాహీకి ప్రత్యేక పూజలు చేయించారు.
అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని ఆమె ఆశీర్వాదాలు కూడా అందుకున్నారు జనసేనాని. అంతేకాదు.. వారాహీ అమ్మవారి నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఉపవాస దీక్ష చేశారు. తన కృషి, పట్టుదలతో పాటు భగవంతుడి ఆశీస్సులతో ఎన్నికల రణక్షేత్రంలో విజయం సాధించి.. కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారు.


Click it and Unblock the Notifications











