షాకింగ్: అంతకు మించి కుదరదన్న పవన్.. ఆ విషయాన్ని దిల్ రాజుతో ముందే చెప్పేశాడట.!
టాలీవుడ్లో ఇప్పుడున్న హీరోల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయం అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అన్నయ్య చూపిన బాటలో నడుస్తూనే ఎనలేని క్రేజ్ను దక్కించుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన పవన్.. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత మాత్రం వాటిని పక్కన పెట్టేశాడు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో మరోసారి మేకప్ వేసుకోడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈయన ఒక్కడికే సాధ్యం అయింది
పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో సినిమాలు వదులుకోవడంతో చాలా మంది ఆయన రీఎంట్రీ గురించి ప్రయత్నాలు చేశారు. పవన్తో సినిమా చేయాలని అనుకున్న ఫిల్మ్ మేకర్ల వల్ల కానిది.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వల్ల అయింది. ఈయనే పవర్ స్టార్తో సినిమా చేస్తున్నారు.

లాయర్ సాబ్గా వస్తున్నాడు
పవన్ కల్యాణ్ రీఎంట్రీ అంటే అదిరిపోయే రేంజ్ ఉండాలి. అందుకే ఓ కమర్షియల్ సినిమా కావాలి అని అంతా అనుకుంటారు. కానీ, పవర్ స్టార్ మాత్రం బాలీవుడ్లో బంపర్ హిట్ కొట్టిన ‘పింక్' సినిమాకు రీమేక్లో నటిస్తున్నాడు. దీనిని తమిళంలో అజిత్ చేశాడు. ఇప్పుడు తెలుగులో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకుంటున్నారు.

స్టేజ్పై అధికారికంగానే ప్రకటించారు
గతంలో పవన్ కల్యాణ్తో సినిమా చేస్తున్నట్లు దిల్ రాజు పలుమార్లు వెల్లడించారు. అయితే, ఆదివారం జరిగిన ‘ప్రతిరోజూ పండగే' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగా అభిమానుల ముందు ప్రకటన చేశారు. ‘త్వరలోనే పవన్ వస్తున్నాడు. పవర్ స్టార్తో సినిమా చేయాలన్నది నా 20 ఏళ్ల కల. అది కొద్ది రోజుల్లో తీరబోతుంది' అని స్టేజ్పై అనడంతో అక్కడున్న వారంతా కేకలు పెట్టారు.

దిల్ రాజుకు పవన్ కండీషన్స్
ఈ సినిమా కోసం దిల్ రాజు.. పవన్ కల్యాణ్ను సంప్రదించిన సమయంలో కొన్ని కండీషన్స్ పెట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులోనే తన రెమ్యూనరేషన్తో పాటు కేటాయించే డేట్స్, ప్రమోషన్స్ కార్యక్రమాలు తదితర అంశాల గురించి ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఒప్పుకునే దిల్ రాజు సినిమాను ప్రకటించారని సమాచారం.

డైరెక్టర్కు అగ్ని పరీక్ష పెట్టిన పవన్
పవన్ కల్యాణ్ చెప్పిన అంశాల్లో డేట్స్ అడ్జస్ట్మెంట్ ముఖ్యమైనదనే చెప్పుకోవచ్చు. ఆయన ఈ సినిమా కోసం మొత్తంగా 21 రోజులు మాత్రమే కేటాయించారని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ 21 రోజుల్లోనే డైరెక్టర్ సినిమాను పూర్తి చేయాలి. కేవలం రెండే సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్కు ఒకరకంగా ఇది అగ్ని పరీక్షే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











