ఆయన పవన్ కాదు .. తుఫాన్ , ఎన్డీయే మీటింగ్లో ఓ రేంజులో ఎలివేషన్ ఇచ్చిన మోడీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్రమోడీ. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎన్డీయే సమావేశానికి కూటమిలోని పార్టీల అధినేతలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ పవన్ను పొగిడేశారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ అని పరిచయం చేస్తూ.. ఆయన పవన్ కాదు, తుపాన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అద్భుత విజయం సాధించామన్న మోడీ.. ఇది ప్రజల ఆకాంక్షలను ప్రతిబించిందన్నారు. పవన్, చంద్రబాబుల వల్లే ఏపీలో భారీ విజయం దక్కిందని ప్రధాని తెలిపారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మోడీ నాయకత్వానికి జనసేన మద్ధతిస్తుందన్నారు. ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని.. మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికీ తలొగ్గదన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ స్పూర్తిగా నిలిచారని , ఆయన నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా.. ఈ సమావేశంలో నరేంద్రమోడీని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నకున్నాయి. అనంతరం బీజేపీ కురువృద్ధులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీల నివాసానికి వెళ్లిన మోడీ.. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కూటమి విజయానికి వ్యూహాలు, ఎత్తుగడలు, పలు అంశాలు దోహదం కారణం కావొచ్చు.. కానీ వీటికి మించి అసలైన శక్తి పవన్ కళ్యాణ్. నచ్చినా, నచ్చకున్నా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి. జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే దానిని నిలబెట్టుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించి బయటకు వస్తూనే ఇకపై టీడీపీ కలిసి జనసేన సాగుతుందని పొత్తు ప్రకటన చేశారు. చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యాక పొత్తు చర్చలు, ఉమ్మడి కార్యాచరణపై మంతనాలు జరిపారు. 50 నుంచి 60 స్థానాలు ఇవ్వకుంటే పొత్తు వద్దని కుల పెద్దలు హెచ్చరించినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. అలాగే బీజేపీ కూడా కూటమిలోకి వస్తేనే ఎలక్షనీరింగ్ సరిగా చేయగలమనే ఉద్దేశంతో ఆ పార్టీని కలుపుకుని పోయేందుకు పవన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కాషాయ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడం కోసం చివరికి తనకు దక్కిన స్థానాలను కూడా వదులుకున్నారు.
అనంతరం కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాడి వేడి ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. అటు జనసేన కేడర్ సైతం తమ అధినేతకు మద్ధతుగా రంగంలోకి దిగారు. పవన్ అభిమానుల్లో మెజారిటీ యువతరం కావడంతో వీరు సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేశారు. దీంతో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా కాకుండా జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా సీన్ మారిపోయింది.
తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. తాను గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ .


Click it and Unblock the Notifications











