ప్రభాస్ సంచలన నిర్ణయం.. 1650 ఎకరాల అటవీ భూమి దత్తత
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ మరో గొప్ప కార్యానికి పూనుకొన్నారు. అటవీ సంపదను రక్షించే బృహత్ కార్యాన్ని ఆయన తన భుజానికి ఎత్తుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వ్యక్తమవుతున్నది. దుండిగల్ ప్రాంతంలోని కాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ను ప్రభాస్ దత్తత తీసుకొన్నారు. పర్యావరణ అభివృద్దికి తోడ్పాటు అందించడానికి ముందుకొచ్చిన ప్రభాస్పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ దత్తత గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Recommended Video

కాజీపల్లి అడవి ప్రాంతాన్ని దత్తత
కాజీపల్లి అడవి ప్రాంతాన్ని దత్తతగా తీసుకొని అర్బన్ ఎకో పార్క్గా రూపొందించడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నారు. ఈ పార్కుకు ప్రభాస్ తండ్రి పేరిట అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కును ఉప్పలపాటి వీ సూర్యనారాయణ స్మారక పార్కుగా వ్యవహరించనున్నారు. ఈ అర్బన్ పార్క్ నిర్మాణం కోసం తొలుతగా రూ.2 కోట్లను డొనేట్ చేశారు. ఈ పార్క్ పురోగతి చెందుతున్న కొద్ది మరిన్ని నిధులను అందించనున్నట్టు ప్రభాస్ చెప్పారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా
కాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ దత్తత కార్యక్రమం రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. పార్క్ అభివృద్ధికి సంబంధించిన పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభాస్, ఎంపీ సంతోష్ కుమార్, తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పార్క్ వ్యూ పాయింట్ నిర్మాణ పనులను ముందుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వు ఫారెస్ట్ దత్తత కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మరికొంత మంది ప్రముఖులకు ప్రేరణ కల్పిస్తామని అన్నారు.

1650 ఎకరాల అటవీ భూమి దత్తత
ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకోవడంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు అందుబాటులోకి రానున్నది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యూ పాయింట్ నుంచి ప్రభాస్ అటవీ అందాలు పరిశీలించారు.

ప్రభాస్ సినీ కెరీర్ ఇలా..
ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నారు. పూజాహెగ్గే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. రాధేశ్యామ్ తర్వాత బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ఆదిపురుష్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మహనటి ఫేం నాగ్ అశ్విన్ దర్వకత్వంలో రూపొందే మరో ప్యాన్ ఇండియా చిత్రంలో నటించనున్నారు. ఇలా మూడు భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉంటూనే సామాజిక బాధ్యతను స్వీకరించడంపై నెటిజన్లు, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











