నా కొడుకుని తొక్కేసేలా కుట్ర... పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి షాకింగ్ కామెంట్స్
రాజకీయాల్లో ఎదగాలంటే ఎత్తులకు, పైఎత్తులు వేయాల్సి ఉంటుంది. ప్రత్యర్ధి కంటే ముందుగానే పావులు కదపాలి. ఇదేరకమైన వాతావరణం చాలా రంగాల్లో ఉన్నదే. ఇక సినీ పరిశ్రమలోనూ ఎన్నో రాజకీయాలు, కుట్రలు, పగలు, ప్రతీకారాలు ఉంటాయని పలువురు ఎన్నోసార్లు చెప్పారు. హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు తమ కళ్ల ముందు ఎదగటం కొందరికి ఇష్టం ఉండదు. రకరకాల కారణాలతో వాళ్లని తొక్కేయాలని చూస్తుంటారు. ఇండస్ట్రీలోని చీకటి కోణాలను పలువురు ఎన్నోసార్లు ప్రస్తావించారు. తాజాగా తన కొడుకు జీవితాన్ని నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లికా సుకుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
సుకుమారన్ వారసుడిగా ఎంట్రీ
దివంగత మలయాళ దిగ్గజ నటుడు సుకుమారన్ కుమారుడే.. పృథ్వీరాజ్ సుకుమారన్. 2002లో నందనం అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పృథ్వీని వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఎంతోమంది అవమానించినా, ఛీత్కారాలు ఎదురైనా ఆయన తట్టుకుని నిలబడ్డారు. ఈ దశలో 2006లో క్లాస్మేట్స్ సినిమాతో వసూళ్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వాస్తవం సినిమాతో తనలోని నటుడిని ఆవిష్కరించారు. ఈ సినిమాకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నారు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగానూ పృథ్వీ రికార్డుల్లోకెక్కారు.

100 సినిమాలు ఫినిష్
అనంతరం కన కందేన్, పారిజాతం, మోజీ, రావణన్, బ్రో డాడీ, డ్రైవింగ్ లైసెన్స్, అయప్పణం కోషియమ్, జనగణమణ, కడువ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. దాదాపు 23 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 100కు సినిమాలలో నటించి శెభాష్ అనిపించుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్గానూ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. లూసిఫర్, బ్రో డాడీ, ఎల్ 2: ఎంపురాన్ చిత్రాలతో దర్శకుడిగా మలయాళ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబుతో తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాలో కుంభగా విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే కుంభగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి స్పందన లభించింది.
విలాయత్ బుద్ధాపై ట్రోలింగ్
ప్రస్తుతం పృథ్వీ నటించిన విలాయత్ బుద్ధా చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇవి కాకుండా ఐ నోబడి, ఖలిఫా, సంతోష్ ట్రోఫి సినిమాలలో నటిస్తున్నారు. అయితే విలాయత్ బుద్ధ సినిమా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప మాదిరిగా ఉండటంతో నెటిజన్లు ట్రోలింగ్కు దిగారు. అయితే ఈ వ్యాఖ్యలను పృథ్వీరాజ్ సుకుమారన్ ఖండించారు. పుష్ప సినిమా కంటే ముందే విలాయత్ బుద్ధను ప్రారంభించామని, దీనికి ఎన్నో ప్రణాళికలు రూపొందించామని పృథ్వీరాజ్ చెప్పారు. జయన్ నంబియార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుమోహన్, ధ్రువన్, వినోద్ థామస్ కీలకపాత్రలు పోషించారు.
నా కొడుకు ఎదుగుదల చూడలేకపోతున్నారు
విలాయత్ బుద్ధ సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ వస్తున్న నేపథ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లికా సుకుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డ కెరీర్ను నాశనం చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారు. విలాయత్ బుద్ధ సినిమా విషయంలో పృథ్వీరాజ్ని కావాలని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయనకు మద్ధతుగా నిలబడేందుకు వచ్చినవారు చాలా తక్కువ మందే. పృథ్వీరాజ్ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఆయన కెరీర్ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పనులను ఆపకపోతే దీనిపై తన పోరాటం ఆగదని మల్లికా సుకుమారన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పృథ్వీరాజ్ కెరీర్ను నాశనం చేయాలని కుట్ర చేసిందెవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











