ఆ సినిమా వల్ల భారీ నష్టం.. అన్నపూర్ణ పక్కన అర ఎకరం అమ్మేశా: రాజేంద్రప్రసాద్
తెలుగు సినీ పరిశ్రమలో నవ్వుల రాజుగా, నటకిరీటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన తన సినీ ప్రయాణం, అవార్డులు, నిర్మాతగా ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఈ మీడియాలో సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ. తనకు పద్మశ్రీ రావడం ఆలస్యమైందనీ, అయితే తాను ఎప్పుడూ అవార్డుల కోసం ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కలిసి అవార్డు అడిగితే వచ్చేదేమో అని కొందరు సలహా ఇచ్చారని, కానీ తాను అలా చేయలేదన్నారు. "అడిగి తీసుకుంటే అది భిక్ష. వారు గుర్తించి ఇచ్చితే అది గౌరవం. ఇప్పుడు నాకు వచ్చిన పద్మశ్రీ అలాంటి గౌరవమే" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తన సినీ జీవితంలో ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమే అతిపెద్ద అవార్డని అన్నారు. ప్రముఖ కవి సినారే తనను ఉద్దేశించి ఒకసారి "నువ్వు ప్రతి ఇంట్లో మంచంలా, కంచంలా అయిపోయావు. అందుకే నిన్ను నటకిరీటి అంటున్నాను" అని చెప్పిన మాటలను గుర్తు చేశారు. ప్రేక్షకుల హృదయాల్లో చిరునవ్వుగా నిలవడం కంటే గొప్ప గుర్తింపు మరొకటి లేదని పేర్కొన్నారు. అలాగే.. నిర్మాతగా చేసిన సినిమాల గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.
విజయ చాముండేశ్వరి బ్యానర్పై మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతో 'మేడమ్', 'రాంబంటు' సినిమాలను తెరకెక్కినట్టు తెలిపారు. 'మేడమ్' సినిమాలో మహిళా పాత్రలో నటించినందుకు నంది అవార్డుల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు లభించిందని చెప్పారు. ఆ అవార్డు రావడానికి అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. అవార్డుల కమిటీ ముందు తన పేరును స్వయంగా ఏఎన్నార్ ప్రతిపాదించారని తర్వాత తెలిసిందని, అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
అయితే నిర్మాతగా చేసిన 'రాంబంటు' సినిమా మాత్రం తనకు భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. "ఆ సినిమా తీసిన తర్వాత నిర్మాతగా మనం పనికిరామని అర్థమైంది. ఆ సినిమా వల్ల అన్నపూర్ణ స్టూడియోస్ పక్కన ఉన్న అర ఎకరం భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా నేను ఎప్పుడూ డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించలేదు. మంచి సినిమా చేయాలనే ఆలోచనతోనే నిర్మాతగా మారాను" అన్నారు.
తన సినీ ప్రయాణంలో ఐదు తరాల నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. నేటి యువ దర్శకులు కూడా తన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications



