రవితేజకు సర్జరీ.. గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్, తీరా పీకల మీదకి
రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టడానికి, వినోదం అందించడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడతారు. రిస్కీ స్టంట్స్ చేస్తూ ఎంతోమంది మరణించగా.. పలువురు మంచానికే పరిమితమయ్యారు. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నూతన్ ప్రసాద్ ఓ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా.. జీవితాంతం ఆయన వీల్చైర్లోనే ఉన్నారు. ఇక మలయాళ నట దిగ్గజం జయన్ ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. నిత్యం షూటింగ్స్లో పాల్గొనే నటీనటులు గాయపడుతూనే ఉంటారు.
ఇదిలాఉండగా.. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ స్టార్ హీరోగా ఎదిగారు. హీరో ఫ్రెండ్గా, సహాయ నటుడిగా, కమెడియన్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నీ స్నేహం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు , కిక్, విక్రమార్కుడు , మిరపకాయ్ , కృష్ణ, పవర్, బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, వాల్తేర్ వీరయ్య తదితర సినిమాలతో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు రవితేజ.

ప్రయోగాలకు దూరంగా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ చిత్రాలు చేయడానికే ఆయన ఇష్టపడతారు. రవితేజ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అని ప్రేక్షకుల నమ్మకం. దానిని వమ్ము చేయకుండా తన జర్నీని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేయాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నారు మాస్ మహారాజా.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఇటీవల రిలీజైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా.. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇందులో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. రిలీజ్కు ముందే భాగ్యశ్రీతో రవితేజ రొమాన్స్ బాగా వైరల్ అయ్యింది. అయితే మూవీకి మిశ్రమ స్పందన వచ్చినా రవితేజ తన భుజాలపై నడిపిస్తున్నారు. మిస్టర్ బచ్చన్కు రూ.33 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.34 కోట్ల వరకు రావాల్సి వుంది.

సినిమా అంటే రవితేజకు పిచ్చి.. ఇందుకోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేస్తారు. గతంలో ఎన్నోసార్లు మాస్ మహారాజా షూటింగ్లో గాయపడ్డారు. రెండేళ్ల క్రితం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్లో రవితేజ మోకాలికి దెబ్బతగలడంతో దాదాపు 10 కుట్లు వరకు పడ్డాయి. ఓ యాక్షన్ సీన్ను తీస్తుండగా ఆయన పట్టుకున్న రోప్ జారిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించినా .. బాధను పంటి బిగువున భరిస్తూనే రవితేజ నటించారట. ఇది వృత్తిపట్ల ఆయన అంకితభావానికి , క్రమశిక్షణకు నిదర్శనం. తన వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల డేట్స్లో మార్పు రాకూడదని, నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మాస్ మహారాజా ఇలా చేశారు.
ప్రస్తుతం రవితేజ తన కెరీర్లో 75వ మూవీలో నటిస్తున్నారు. సామజవరగమనకు రైటర్గా పనిచేసిన భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీకి కోహినూర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రవితేజ గాయపడ్డారు. కుడిచేతికి గాయమైనా లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొనడంతో నొప్పి తీవ్రమైంది. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రవితేజకి వైద్యులు సర్జరీ చేసి.. ఆరువారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు మాస్ మహారాజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











