ఆ రోజు ఏటీఎం దగ్గర ఏడ్చేశా... సాయిధరమ్ తేజ్ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మంది హీరోలు చిత్ర సీమలో స్థిరపడ్డారు. వారిలో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. చిరంజీవి చెల్లెలి కుమారుడే సాయిధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ అండతో సినిమాల్లోకి లాంచ్ అయినప్పటికీ తన కష్టం, ప్రతిభతో టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయితేజ్. యూత్ఫుల్ సినిమాలు చేస్తూనే విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే దీని వెనుక ఎంతో కష్టం ఉంది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తుచేసుకుంటూ సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
2014లో పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు సాయిధరమ్ తేజ్. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపక్ష, బ్రో తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు సినిమాలో సాయితేజ్ నటిస్తున్నారు. హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ మెగా హీరో.

సక్సెస్ఫుల్గా సాగిపోతున్న సాయిధరమ్ తేజ్ కెరీర్కు యాక్సిడెంట్ బ్రేక్ వేసింది. 2021 సెప్టెంబర్ 11న హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ.. కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కుటుంబ సభ్యుల సహాకారం, అభిమానుల ఆశీస్సులతో తిరిగి కోలుకున్న సాయిధరమ్ తేజ్ విరూపక్షతో సాలీడ్ హిట్ అందుకుని తిరిగి రేసులోకి వచ్చారు. సినిమాలు చేస్తూనే సామాజిక కార్యక్రమాల్లోనూ సాయిధరమ్ తేజ్ ముందుంటున్నారు. ట్రాఫిక్తో పాటు పలు సమస్యలపై అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సేవ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దగ్గర అన్నీ కోల్పోతాము. మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది? అలాంటిది మీ జీవితంలో ఏమైనా జరిగిందా? అని యాంకర్ అడగ్గా.. దానికి సాయిధరమే తేజ్ స్పందిస్తూ.. 2009లో యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చా.. 2010లో యాక్టింగ్ కోర్స్ అయిపోయింది, రేయ్ సినిమా ఓపెన్ అయ్యింది. 2011-2012లో ఆర్ధిక పరిస్ధితి ఏమాత్రం బాగుండేది కాదు. మీటింగ్కి వెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవు. కారులో డీజిల్ కొట్టించాలి, ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అప్పట్లో ప్రీ పెయిడ్ కదా? నా దగ్గర బ్యాలెన్స్ లేదు. పెట్రోల్ కొట్టించాలంటే 500 కావాలి.. కార్డ్లో 500 ఉంది, 450 కొట్టించి 50 రూపాయలు ఫోన్లో రీఛార్జ్ చేయించి నెల రోజులు గడిపేద్దామని అనుకున్నానని సాయి అన్నారు.
పెట్రోల్ కొట్టించి 450 రూపాయలు ఇచ్చేశాను.. 50 రూపాయలు డ్రా చేద్దామని ఏటీఎంకి వెళ్లా, కానీ మినిమం బ్యాలెన్స్ కండీషన్ వల్ల డ్రా చేయడం కుదరదు. అయినా పర్లేదని బ్యాలెన్స్ చెక్ చేస్తే రెండు లక్షలో, లక్ష రూపాయలో ఉంది. నాకేం అర్ధం కాలేదు.. మా అమ్మకి ఫోన్ చేశా. నా అకౌంట్లో నువ్వేమైనా డబ్బులు వేశావా? బ్యాలెన్స్ 2 లక్షల రూపాయపలు చూపిస్తోంది నాకు అర్ధం కావడం లేదని అడిగా. అవును రా.. రాత్రి నువ్వు చెప్పావు కదా నా దగ్గర డబ్బులు లేవని. నేను వేశాను, ఈ డబ్బును వాడుకోమని మా అమ్మ చెప్పింది. ఆ మాటలతో ఏటీఎం దగ్గర కూర్చొని ఏడ్చేశా.. అమ్మకి మన గురించి అంతా తెలుసు. ఆమెకు ఏం ఇవ్వాలో? ఇవ్వకూడదో తెలుసు. అదే గొప్పతనమని సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.
దేవుడిని బాగా నమ్ముతా.. చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామి అంటే బాగా ఇష్టం. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్.. నేనేం చేసినా నా వెనుక ఉంటాడని ఒక నమ్మకం. టెంపుల్స్కి పిచ్చోడిలా వెళ్తా.. సినిమా ప్రమోషన్స్లోనే డివోషనల్ టూర్స్ చేస్తుంటా. తిరుపతి వెళ్తే.. కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుమల, కడప దర్గా.. వైజాగ్ దగ్గరికి వెళ్తే అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం, అన్నవరం వెళ్తుంటా. ఎలాంటి నెగిటివిటీ అయినా పాజిటివిటీగా మార్చుకోవాలి. చెన్నైలో చదువుకుంటున్నప్పుడు చిరంజీవి గారి మేనల్లుడన్న విషయాలు అక్కడ మాట్లాడేవారు కాదు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో ఇక్కడ అలాంటి మాటలు వినిపించేవి. చిరంజీవి గారిలా ఉన్నానని ప్రజలు చెబుతుంటారు. ఇది నాకు ఒక దక్కిన వరం.. నేను మా మావయ్యలాగా ఉన్నాననే ఒక ఎగ్జయిట్మెంట్ నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారి దగ్గరి నుంచి హార్డ్ వర్క్ నేర్చుకున్నా.. హార్ట్ అండ్ సోల్ క్యారెక్టర్ మీద పెట్టేస్తారు. ఎంత ఇబ్బందిపడుతున్నా సరే దాని నుంచి వెనక్కి రారు. కళ్యాణ్ గారి దగ్గరి నుంచి నిజాయితీగా ఉండటం, కమిట్మెంట్ నేర్చుకున్నా. నాగబాబు దగ్గరి నుంచి ఏ సమస్య వచ్చినా చిరునవ్వుతో ఉండటం నేర్చుకున్నానని సాయిధరమ్ తేజ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications



