పవన్ కల్యాణ్ లేకపోతే నేను లేను.. అలా ప్రాణాలతో బయటపడ్డా.. సాయిధరమ్ తేజ్ భావోద్వేగం
తెలుగు సినిమా యువ హీరో సాయిధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కల్యాణ్ గురించి, అలాగే తన యాక్సిడెంట్ సమయంలో ప్రాణాలతో ఎలా బయటపడ్డారనే విషయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జాతీయ దినపత్రిక, వెబ్ సైట్ ఏబీపీ నిర్వహిస్తున్న ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 సదస్సులో పాల్గొన్నారు. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే సాయిధరమ్ తేజ్కు ఎంత ప్రాణమో చెప్పనక్కర్లేదు. ఆయన గురించి మాట్లాడమంటే ఎన్నో విషయాలు వెల్లడిస్తుంటారు. పలు సందర్భాల్లో తనకు తన మేనమామ ఎలాంటి ప్రోత్సాహం అందించారనే విషయాన్ని స్వయంగా చెబుతూనే వస్తున్నారు. తాజాగా ఏబీపీ సదస్సులో ఆయన మరోసారి తన గురు భక్తిని చాటుకొన్నారు.

పవన్ కల్యాణ్ నా గురువు. ఆయనకు నేను గురు దక్షిణ ఇవ్వాలనుకొంటున్నాను. నేను నటుడిగా మారాలని అనుకొన్నప్పుడు. యాక్టింగ్ చేయడానికి ఆయన ప్రోత్సాహించాడు. నటనకు కావాల్సిన శిక్షణ కోసం సహాయం చేశాడు. యాక్టింగ్ కెరీర్కు గైడెన్స్ ఇచ్చాడు. ఫైట్స్, కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చాడు.నా జీవితానికి కావాల్సిన కీలక విషయాలకు స్పూర్తి అందించారు. ఆయన నా గైడ్. నన్ను అలా నడిపిస్తుంటాడు అని సాయిధరమ్ తేజ్ అన్నారు. బ్రో సినిమాలో ఆయనతో నటించడం నాకు ఆయనకు సమర్పించిన గురుదక్షిణి అని అన్నాడు.
మీడియా సభ్యులకు, కెమెరామెన్లకు, ఇక్కడ హాజరైన ప్రతీ ఒక్కరికి నాది ఒకే విన్నపం. అందరూ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఆ హెల్మెట్ నన్ను కాపాడింది. అదే నేను పెట్టుకోకపోతే నేను బతికి ఉండే వాడిని కాదు. మీ ముందు ఇలా కూర్చొని ఉండేవాడిని కాదు. కాబట్టి తప్పకుండా మీరు హెల్మెట్ ధరించాల్సిందే అని సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఈ విషయాన్ని హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో తెలిపారు.

ఇదిలా ఉండగా, కొద్ది నెలల క్రితం సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురైన సంగతి తెలిసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కొద్ది రోజులు కోమాలోనే ఉండిపోయారు. అపోలో హాస్పిటల్ వైద్యులు శ్రమించి ఆయన ఆరోగ్యాన్ని సరిదిద్దారు. అప్పటి నుంచి రోడ్డు ప్రయాణంలో సరైనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతీ చోట ఆయన ఓ మెసేజ్ ఇస్తారు.
ఇదిలా ఉండగా, యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సంచలన విజయం సాధించింది. ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా సుమారుగా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన హనుమాన్ నిర్మాత రూపొందించే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సుమారుగా 100 కోట్లకుపైగా బడ్జెట్తో రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











