నన్ను వాడుకుని వదిలేసినవాళ్లే... ఒక్కొక్కడికి చూపిస్తా... శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యువ హీరోలలో విలక్షణ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శర్వానంద్. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు శర్వానంద్. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకోలేకపోయారు. వరుస ఫ్లాపులు ఆయనను నెంబర్ గేమ్లో వెనక్కి లాగేశాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదలైన నారీ నారీ నడుమ మురారి మూవీతో శర్వానంద్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన స్పెషల్ చిట్ ఛాట్లో తన కెరీర్, జీవితంపై శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
చిరుతో కలిసి థమ్సప్ యాడ్
విజయవాడకు చెందిన శర్వానంద్ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో హీరోలు రామ్ చరణ్, రానా దగ్గుబాటిలు శర్వానంద్కు క్లాస్మేట్స్. అలా దగ్గుబాటి, మెగా కుటుంబాలతో శర్వానంద్కు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. తొలుత మోడల్గా కెరీర్ ప్రారంభించిన శర్వానంద్... ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవితో థమ్సప్ యాడ్లో నటించి అందరి దృష్టిలో పడ్డారు.

వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమా
తొలుత ఐదో తారీఖు, శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మీ సినిమాలలో చిన్నా చితకా పాత్రలలో నటించారు. ఆ తర్వాత వెన్నెల, అమ్మ చెప్పింది, గమ్యం చిత్రాలతో హీరోగా తనలోని విలక్షణ నటుడిని పరిచయం చేశారు శర్వానంద్. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు చిత్రాలతో శర్వానంద్ రేంజ్ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత గడిచిన ఆరేడు ఏళ్లుగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు శర్వా. రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి.
నారీ నారీ నడుమ మురారితో హిట్
స్టార్ రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్ధితుల్లో నారీ నారీ నడుమ మురారి మూవీపై శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ అంచనాలను నిజం చేస్తూ సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఈ సినిమా. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా శర్వానంద్, సునీల్, నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు రామ్ అబ్బరాజులు చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి బాగా డిస్ట్రబెన్స్ ఉన్నాయని, కొట్టుకున్నారని బయట టాక్ రామ్ ప్రశ్నించారు. దీనికి శర్వా స్పందిస్తూ.. మేమిద్దరం కొట్టుకుంటే నీకు ఛాన్స్ రాదు అన్నారు.
ఎంతోమందికి సాయం చేశా
నాకు లాస్ట్ ఆరు నెలలు టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా నా పరిస్ధితి ఉంది అని అనిల్ అన్నారు. నాకు అనిల్ గారు బ్రదర్ కంటే ఎక్కువ. సినిమా ఒక్కటే కాదు.. ఇంకా చాలా విషయాల్లో మేమిద్దరం కలిసి నడుస్తున్నాం. అందరి పరిస్ధితి ఎలా ఉందంటే.. ఒకరికొకరు హెల్ప్ చేసుకునే పరిస్ధితి కూడా లేదు. ఇప్పుడు చెప్పొచ్చో లేదో కానీ... నాకు ఒక హిట్టు వచ్చి ఆరేడు సంవత్సరాలు అయ్యింది. మన పరిస్ధితి ఒకలా ఉంది. ఆయన కొన్ని సినిమాలు బాగా ఆడలేదు. ఎవరు ఎవరికీ హెల్ప్ చేసుకునే పరిస్ధితి లేదు. మాకు మేమే చూసుకోవాలి, మేమే చేయాలి. నేను చాలామంది ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేశా ఇంతకు ముందు. అందరూ వాడుకున్నారు తప్పితే.. హెల్ప్ చేసినప్పుడు నా వాళ్లు అని ఉండాలి కదా? అలా లేకుండా ఉన్నోళ్లే ఎక్కువ అయిపోయారు అని శర్వానంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై నేనెంటో చూపిస్తా
నమ్మాలి అన్నా కూడా.. నాకే తెలియకుండా ఓ తిక్కలోకి వచ్చేశా. అనిల్ గారికి నాకు అలాంటిది ఎప్పుడూ లేదు. మనిషిని నమ్మలేదంటే మనం బతికి వేస్ట్. ఎన్నిసార్లయినా మోసపోవడానికి ఓకే కానీ, ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే.. ఇంకోసారి ఎవడైనా మోసం చేస్తే కనుక అప్పుడు చూపిస్తాం. ఎందుకంటే ఎన్నిరోజులుగా పడిఉన్నాం అని శర్వానంద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శర్వానంద్ని ఇండస్ట్రీలో మోసం చేసింది ఎవరు అంటూ అతని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











