పంచెకట్టులో మహేశ్ బాబు కొడుకుని చూశారా.. వావ్ అంటోన్న ఫ్యాన్స్
సూపర్స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలు, షూటింగ్లు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. తీరిక వేళల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్పులకు వెళ్తుంటారు. హైదరాబాద్లో షూటింగ్లు ఉంటే వర్క్ త్వరగా కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లడానికే ట్రై చేస్తారు మహేశ్. ఆయన బాటలో ఎంతో మంది హీరోలు నడుస్తూ జెంటిల్మెన్ అనిపించుకుంటున్నారు.
ఇండస్ట్రీలో ఉన్న వారు తమ వారసులను కూడా హీరోలు, హీరోయిన్లుగా పరిచయం చేసే కల్చర్ మన తెలుగునాట ఎప్పటి నుంచో ఉన్నదే . ప్రజంట్ తెలుగు తెరపై స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వారంతా వారసులే. సూపర్స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ .. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. సినిమాలు, సేవా కార్యక్రమాల్లో ఆయన కృష్ణగారిని మించే చేస్తున్నారు. మహేశ్ కుమారుడు గౌతమ్ కూడా పెద్దవాడవుతున్నాడు.. బలమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో గౌతమ్ చాలా ఈజీగా హీరోగా లాంచ్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

చిన్నతనం నుంచి గౌతమ్ను మీడియాకు దూరంగా పెంచారు మహేశ్.తన ఫోకస్ మొత్తాన్ని అతను చదువుపైనే పెట్టాడు.. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన గౌతమ్ మరో రెండేళ్లలో 20వ ఏట అడుగుపెడుతున్నాడు. తండ్రి అందం, ఫిజిక్, పర్సనాలిటీని పుణికిపుచ్చుకున్న గౌతమ్ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఘట్టమనేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య జిమ్లో షర్ట్ విప్పి వర్కవుట్స్ చేస్తున్న గౌతమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన మురారి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు కృష్ణవంశీ. దీనిలో భాగంగా గౌతమ్ను హీరో ఇంట్రడ్యూస్ చేస్తూ మురారి సీక్వెల్ తీయాల్సిందిగా ఓ అభిమాని కోరాడు. ఇది మహేశ్, నమ్రత, గౌతమ్ చేతుల్లో ఉందంటూ కృష్ణవంశీ తెలివిగా తప్పించుకున్నారు.
కొద్దికాలంగా గౌతమ్ మీడియా ముందు ఎక్కువగా కనిపిస్తున్నాడు. తాజాగా మహేశ్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నమ్రత శిరోద్కర్, గౌతమ్, సితారలు నడక దారిలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. దారి పొడవునా అభిమానులను పలకరిస్తూ , వారితో సెల్ఫీలు దిగుతూ మహేశ్ కుటుంబం తిరుమల చేరుకుంది. బుధవారం రాత్రి సుధాకృష్ణ నిలయం అతిథి గృహంలో బస చేసి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల నమ్రత, సితార, గౌతమ్లు ఫోటోలకు ఫోజులిచ్చారు. ముఖ్యంగా గౌతమ్ పంచెకట్టులో అదిరిపోతున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











