AP Elections 2024: ‘డబ్బే కాదు.. ప్రాణాలను లెక్కచేయకుండా పవన్ కల్యాణ్ కోసం.. ఇలాంటి ఎన్నికలు చూడలేదు’
ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసిన ఆయన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. కారణాలు ఏమైనా కానీ ఎక్కడో తప్పు జరిగిందని అంతర్గత సమీక్షలో పవన్ తేల్చారు. ఈసారి అలాంటి లోపాలకు తావు ఇవ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు పవన్ కళ్యాణ్. ఎక్కడ పోటీ చేసేది ముందు నుంచి చెప్పకుండా తన పని సైలెంట్గా చేసుకెళ్లారు.
కాపు సామాజికవర్గం, మెగా అభిమానులు బలంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పవన్ కోసం నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లతో పాటు జబర్దస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, జానీ మాస్టర్, ఆర్కే సాగర్ తదితరులు ప్రచారం చేశారు. వీరికి తోడు టీడీపీ , జనసేన, బీజేపీ కేడర్ పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించారు.

పవన్ కళ్యాణ్ , జనసేన నేతల కన్నా ఆయన అభిమానులు పిఠాపురంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఆయన నుంచి నిర్ణయం వెలువడిన నాటి నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి పిఠాపురానికి క్యూకట్టారు. నియోజవర్గంలోని గడప గడపకు వెళ్లి పవన్ కళ్యాణ్కు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు. క్షేత్ర స్థాయిలో ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ పవన్ భావజలాన్ని, జనసేన సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లారు. వైసీపీ విమర్శలకు సైతం ధీటుగా కౌంటరిచ్చి సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్కు అండగా నిలిచారు. పోలింగ్కు ముందు ఆ తర్వాత వైసీపీ ప్రలోభాలను అడ్డుకోవడంలోనూ , ఓటర్లను చైతన్యపరచడంలోనూ జనసేన , పవన్ అభిమానులు శ్రమించారు.
టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం పవన్ అభిమానులను మెచ్చుకున్నారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రచారంలో చోటు చేసుకున్న సంఘటనలను పంచుకున్నారు. పిఠాపురానికి వచ్చినవాళ్లు పవన్పై అభిమానంతో ఖర్చుకు సైతం వెనుకాడలేదని.. జనసేన, టీడీపీ నుంచి ఒక్క పైసా కూడా రాలేదన్నారు. జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు అనేది సహజంగా జరిగేదని.. ఒకవేళ ఎవరైనా ఇందుకోసం డబ్బులు అడిగితే పవన్ ఫ్యాన్స్ ఇచ్చేవాళ్లేమోనని వర్మ వ్యాఖ్యానించారు. ప్రచారంలో భాగంగా తాను ఓ గ్రామానికి వెళ్తుంటే మంచి టోపీలు, కళ్లజోళ్లు పెట్టుకుని అమ్మాయిలు తిరుగుతున్నారని తెలిపారు.

వూరుకు కొత్తగా వున్నారని పిలిచి అడిగితే తాము బెంగళూరు నుంచి వచ్చామని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లమని చెప్పారని వర్మ వెల్లడించారు. మీకు ఇక్కడి సంగతులు తెలియవు కదామ్మా అని అడిగితే.. ఓట్లు అడుగుతున్నామని చెప్పారని, దీంతో సూపర్ సిక్స్ ఉన్న పాంప్లెట్స్ కూడా ఓటర్లకు ఇవ్వమని ఇచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లారని.. రాజకీయంగా మా వర్క్ మేం చేస్తున్నామని, దీనికి వాళ్లు కూడా తోడయ్యారని ప్రశంసించారు. జీవితంలో ఇలా ఎన్నికలు జరగడం తాను చూడలేని, అలాంటివాళ్లు ఉండటం పవన్ అదృష్టమని వర్మ కొనియాడారు.


Click it and Unblock the Notifications











