భూ వివాదంలో జూ ఎన్టీయార్.. కోర్టు మెట్లెక్కిన యంగ్ టైగర్.. అసలు ఏం అయిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలోని రూ.24 కోట్ల విలువైన ఆస్తికి సంబంధించిన భూ వివాదంలో ఉపశమనం కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాపర్టీని తనకు విక్రయించిన గత యజమాని నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లుగా జూనియర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తమకు రావాల్సిన సొమ్ము కోసం బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించగా.. ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు అది ఆర్డర్స్ ఇచ్చింది.
అసలు వివాదంలోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 75లోని 681 చదరపు గజాల స్థలాన్ని జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన సుంకు గీతా లక్ష్మీ అనే మహిళ నుంచి రూ.36 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఆయన తన అభిరుచికి తగిన విధంగా , విలాసవంతంగా ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ భూమి మార్కెట్ విలువ గజం రూ.3.5 లక్షలకు పెరిగింది. డెట్ రికవరీ ట్రిబ్యూనల్ .. ఈ ఆస్తిపై బ్యాంకులపై హక్కును కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డీఆర్ఏటీ) ద్వారా అందుబాటులో ఉన్న అప్పీలేట్ రెమెడీని ఉపయోగించుకోకుండా డీఆర్టీ ఉత్తర్వులపై హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన వెకేషన్ బెంచ్ జూనియర్ ఎన్టీఆర్ను గురువారం ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ తరపు న్యాయవాది.. డీఆర్టీ ఆర్డర్లో సాంకేతిక లోపాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జూన్ 3 లోగా డాకెట్ ఆర్డర్ తమకు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది హైకోర్టు.
మరోవైపు.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన టైటిల్ పత్రాలు, తన వద్ద వున్న టైటిల్ పత్రాలను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపినట్లుగా ఎన్టీఆర్ తెలిపారు. పరీక్షలో తన వద్ద ఉన్న పత్రాలు నిజమైనవిగా నిర్ధారణ జరిగిందని.. దీంతో బ్యాంకర్లంతా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంభినేషన్లో తెరకెక్కుతోన్న 'దేవర ' కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం.. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా కావడంతో దేవరపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా దేవరను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. పార్ట్ -1ను ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల కానుంది.
అలాగే హిందీలో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 సైతం సెట్స్పైకి వెళ్లింది. 10 రోజుల షెడ్యూల్ను కూడా జూనియర్ ముగించారు. వార్ -1ను మించేలా వార్-2లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని బాలీవుడ్ టాక్. 2025 ఆగస్ట్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











