వాయనాడ్ బాధితులకు అల్లుఅర్జున్ భారీ సహాయం.. ’కేరళ’ కోసం స్పందించిన తొలి హీరోగా ఐకాన్ స్టార్
ప్రకృతి విలయతాండవంతో కేరళ వణికిపోయిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలతో వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, భారీగా క్షతగాత్రులయ్యారు. శిథిలాల కింద జనం చిక్కుకునే ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కేరళ అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. బాధితులను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక సాయాన్ని తీసుకుంటున్నారు. డ్రోన్లు, జీపీఎస్, రాడార్, సుశిక్షత జాగిలాలను రంగంలోకి దించారు.
గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఛిద్రమై, గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన మృతదేహాలకు పోస్ట్మార్టం చేయలేక వైద్యులే వణికిపోతున్నారంటే ఏ స్థాయిలో విపత్తు చోటు చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటనలో ఆస్తిపాస్తులు, భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను, ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. తమ వారి ఆచూకీ తెలియక .. ప్రాణాలతో మిగిలారో లేదోనన్న భయంతో కొందరు నరకయాతన అనుభవిస్తున్నారు.

దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన కొందరు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. రెప్పపాటులో చోటు చేసుకున్న ఘోర విపత్తే ఇంకా వారి కళ్ల ముందు కదలాడుతూ ఉంది. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రముఖ మానసిక వైద్యులను వయనాడ్ పరిసర ప్రాంతాలకు పంపి బాధితుల్లో మనోస్థైర్యం నింపేందుకు కృషి చేస్తోంది. అటు కేరళను ఆదుకునేందుకు కేంద్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.
ఇకపోతే.. దేశ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. విపత్తులొచ్చినప్పుడు తొలుత స్పందించేది సినీనటులే. తమను ఇంతటివారిని చేసిన సమాజం కష్టంలో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేస్తారు. తాజా కేరళ విపత్తుపైన సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు సినిమా వేడుకలు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లుగా మలయాళ చిత్ర పరిశ్రమ ప్రకటించింది. మల్లూవుడ్తో పాటు దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం వయనాడ్ బాధితులకు అండగా నిలిచింది. మోహన్ లాల్ స్వయంగా ఆర్మీ దుస్తుల్లో ఘటనాస్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనగా.. పలువురు నటీనటులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ చేరారు. వయనాడ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన సహాయ పునరావాస కార్యక్రమాల కోసం తన వంతుగా రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. కేరళ ప్రజలు తనను ఎంతగానో అభిమానిస్తారని.. అలాంటిది వయనాడ్ ఘటన తనని ఎంతో కలచివేసిందని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్కు మలయాళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలను ఆయనను ప్రేమతో మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు.
మలయాళ స్టార్ హీరోల సినిమాలకు మించి బన్నీ చిత్రాలు వసూళ్లను రాబడతాయంటే అతిశయోక్తి కాదు. కేరళలో తనకు లభిస్తున్న ఆదరణ వల్లే తెలుగు ప్రజలు నన్ను చూసే విధానం మారిందని స్వయంగా అల్లు అర్జున్ ఒకానొక సందర్భంలో తెలిపారు. అంతలా తనను గుండెల్లో పెట్టుకున్న కేరళ గడ్డ ఇప్పుడు కష్టంలో ఉండటంతో ఆయన తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మంచి మనసుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











