ఆ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం.. అస్సలు బయటకి రాలేదే
ఎవరు కాదన్నా , ఔనన్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఆ రాష్ట్ర రాజకీయాలు ఈసారి జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరిగాయి. చిన్న రామయ్య క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు పార్టీలు పోటీలు పడ్డాయి. ఆయన మావాడంటే .. మావాడని కొట్టుకున్నారు. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీల్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు హల్చల్ చేశాయి. తాత పెట్టిన పార్టీకి జూనియర్ బహిరంగంగా తన మద్ధతు ప్రకటించలేదు. ప్రచార గడువు ముగిసే క్షణం ముందైనా కనీసం ట్వీట్ అయినా చేస్తారని తెలుగు తమ్ముళ్లు, ఆయన అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ముంబైలో తాను నటిస్తున్న వార్ -2 షూటింగ్లో బిజీగా ఉన్న జూనియర్.. పోలింగ్కు ముందు రోజు హైదరాబాద్ చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదిలావుండగా.. ఎన్టీఆర్ గొప్ప మానవతావాది. ఆపదలో వున్న వారికి తన వంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో పబ్లిసిటీకి దూరంగా వుంటారు ఎన్టీఆర్. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆలయానికి ఆయన భారీ విరాళం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నపేటలో వేంచేసియున్న భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ రూ.12.50 లక్షలు విరాళం ఇచ్చారని సమాచారం. ఈ మేరకు విరాళం ఇచ్చినట్లుగా గుడి ఆవరణలో దాతల పేర్లను శిలాఫలకంపై రాయించారు . దానిపై ఎన్టీఆర్ , ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు భార్గవ్రామ్, అభయ్రామ్, తల్లి షాలిని పేర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంభినేషన్లో తెరకెక్కుతోన్న 'దేవర ' కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం.. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా కావడంతో దేవరపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు.
రెండు భాగాలుగా దేవరను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. పార్ట్ -1ను ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని దేవర నుంచి ఫస్ట్ సింగిల్ లాంచ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు.
అలాగే హిందీలో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 సైతం సెట్స్పైకి వెళ్లింది. 10 రోజుల షెడ్యూల్ను కూడా జూనియర్ ముగించారు. వార్ -1ను మించేలా వార్-2లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని బాలీవుడ్ టాక్. 2025 ఆగస్ట్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











