HBD Uday Kiran: అర్ధాంతరంగా ఆరిపోయిన ఉదయ్ కిరణ్ జీవితం.. ఆ 3 సినిమాలతో సంచలనం!
ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం ప్రతిభ, కష్టంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. లవ్ స్టోరీలు, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్తో పాతికేళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించి.. ఈ మిలీనియంలో టాలీవుడ్లో తొలి సూపర్స్టార్గా ఇమేజ్ దక్కించుకున్నాడు. లవర్బాయ్ ఇమేజ్తో, వరుస బ్లాక్బస్టర్స్తో నాటి స్టార్ హీరోలను సైతం వణికించాడు. కానీ విధి మరోలా ఆలోచించింది. అవకాశాలు తగ్గుముఖం పట్టడం, వ్యక్తిగత సమస్యలతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణించి 12 ఏళ్లు గడుస్తున్నా ఉదయ్ కిరణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. జూన్ 26న ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా ఆయన సినీ జీవితం, ఇతర ఆసక్తికర విశేషాలు పరిశీలిస్తే..
26 జూన్ 1980న హైదరాబాద్లో జన్మించారు ఉదయ్ కిరణ్. సికింద్రాబాద్లోని వెస్లీ డిగ్రీ కాలేజీలో చదువుకున్న ఆయనకు దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రంలో హీరోగా అవకాశం దక్కింది. ఈ సినిమా ఘన విజయం సాధించగా ఉదయ్ కిరణ్కు వరుసగా అవకాశాలు వరించాయి. నువ్వునేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, హోలీ, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, లవ్ టుడే, ఔనన్నా కాదన్నా వంటి వరుస హిట్స్తో ఇండస్ట్రీలో సూపర్స్టార్ ఇమేజ్ వచ్చింది. యూత్, కుటుంబ ప్రేక్షకులు ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. అగ్రనటులు చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుల సినిమాలను మించి ఉదయ్ సినిమాలు ఓపెనింగ్స్తో పాటు భారీ వసూళ్లను రాబట్టేవి.

తెలుగులో స్టార్డమ్ నేపథ్యంలో తమిళంలోనూ ఉదయ్ కిరణ్కు అవకాశాలు వచ్చాయి. పోయ్ అనే మూవీతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన వాంబుచంద, పెన్ సింగం అనే సినిమాలలో నటించారు. విశిష్ట అనే యువతితో 2012 అక్టోబర్ 24న ఉదయ్ పెళ్లి జరిగింది. అయితే ఈ సక్సెస్ను ఉదయ్ కిరణ్ కొనసాగించలేకపోయారు. వరుస పరాజయాలు ఆయనను కృంగదీశాయి, దీనికి తోడు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులతో ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగిపోయారని సన్నిహితులు చెప్పేవారు. మానసికంగా ఉక్కిరిబిక్కిరి అయి.. డిప్రెషన్తో అర్ధాంతరంగా తనువు చాలించారు ఉదయ్ కిరణ్. 2014 జనవరి 5న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ మరణవార్త తెలుగు ప్రజలను, టాలీవుడ్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనను కడసారి చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. మరణించే నాటికి ఉదయ్ కిరణ్ వయసు కేవలం 33 ఏళ్లే.
ఉదయ్ కిరణ్ చివరిసారిగా చిత్రం చెప్పిన కథ అనే సినిమాలో నటించారు. మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మదాలస శర్మ, గరిమా జైన్లు హీరోయిన్గా నటించారు. ఉదయ్ బతికున్నప్పుడే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు. ఆయన వద్ద అసిస్టెంట్గా పనిచేసిన మున్నా ఈ సినిమాను నిర్మించారు. ఉదయ్ మరణించి దాదాపు 12 ఏళ్లు కావొస్తున్నా ఆయన చివరి సినిమా రిలీజ్కు నోచుకోలేకపోతోంది. దీనితో పాటు నందమూరి బాలకృష్ణ స్వీయ దర్వకత్వంలో నటించే అవకాశం కూడా ఉదయ్ కిరణ్కు దక్కింది. అదే నర్తనశాల. పాండవుల వనవాసం, విరాట్ పర్వం బ్యాక్డ్రాప్లో నర్తనశాల అనే సినిమాను బాలయ్య డైరెక్ట్ చేయాలని భావించి సెట్స్ మీదకు కూడా తీసుకెళ్లారు. ఇందులో సౌందర్య ద్రౌపదిగా, ఉదయ్ కిరణ్ అభిమన్యుడిగా నటించారు. అయితే సౌందర్య ఆకస్మిక మరణం, తదితర కారణాలతో బాలయ్య ఈ ప్రాజెక్ట్ను పక్కనపెట్టారు.
ఉదయ్ కిరణ్ తన ఆరంగేట్రంతోనే సంచలనం సృష్టించారు. వరుసగా మూడు బ్లాక్బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అవి చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే ఈ సినిమాలు సూపర్హిట్ కావడంతో పాటు ఒక్కొక్కటి 175 రోజులకు పైగా ప్రదర్శితమైంది. అలా కెరీర్లో నటించిన తొలి మూడు సినిమాలు బ్లాక్బస్టర్ కావడంతో పాటు ఆ సినిమాలన్నీ 175 రోజులు ప్రదర్శితమైన ఏకైక హీరోగా ఉదయ్ కిరణ్ చరిత్ర సృష్టించారు. అంతేకాదు నట దిగ్గజం కమల్ హాసన్ తర్వాత పిన్న వయసులోనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న ఏకైక హీరో ఉదయ్ కిరణ్ మాత్రమే. తన అందం, నటన, స్టార్డమ్తో తెలుగు తెరను ఏలతాడనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా తన జీవిత ప్రయాణాన్ని ముగించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మరణించినా తన సినిమాల ద్వారా ఉదయ్ కిరణ్ తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.


Click it and Unblock the Notifications


