రష్మిక మందన్న సాక్షిగా... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలు తమ బ్యాచిలర్ లైఫ్కి గుడ్బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో తెలుగు, కొడవ వివాహ సాంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ఆ తర్వాత రిసెప్షన్లు, ఫ్యాన్ మీట్లు, సొంతూరిలో కొన్ని కార్యక్రమాలతో తమ పెళ్లి వేడుకల్ని చిరస్మరణీయం చేసుకున్నారు రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ.
ఉదయ్పూర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కొత్త దంపతులు తమ పెళ్లి వేడుకలలో దేశ ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రజలకు స్వీట్స్ పంపిణీతో పాటు ప్రసిద్ధ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విజయ్ దేవరకొండ స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా బలమూరు మండలం తుమ్మన్పేటలో కొత్త జంట సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తుల కోసం నోరూరించే వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన సతీమణి రష్మిక, కుటుంబ సభ్యుల సమక్షంలో కీలక ప్రకటన చేశారు. అచ్చంపేట డివిజన్లోని మొత్తం 44 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన వారికి స్కాలర్షిప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విజయ్ దేవరకొండ. తన కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోన్న దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.
దీని తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్లోని ఓ హోటల్లో అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు విజయ్ - రష్మిక. అనంతరం మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత అన్ని కార్యక్రమాలను ముగించుకుని విజయ్ - రష్మికలు హనీమూన్ నిమిత్తం థాయ్లాండ్లోని కో సామ్యూయ్ దీవికి వెళ్లారు.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక మందన్నతో కలిసి అత్తగారి ఊరు కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేటకు చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులు, రష్మిక బంధువుల నిమిత్తం రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడవ మహిళగా రష్మిక మందన్న సాంప్రదాయ వస్త్రాలు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. పెళ్లి వేడుకలు ముగియడంతో తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు రష్మిక- విజయ్. కాక్ టెయిల్ 2, మైసా సినిమాలతో రష్మిక బిజీగా ఉన్నారు. రౌడీ జనార్థన్, రణబాలి సినిమాలో విజయ్ నటిస్తున్నారు.
ఇకపోతే.. రోజులు గడుస్తున్నప్పటికీ ఊరికి ఇచ్చిన మాటను విజయ్ మరిచిపోలేదు. అన్న మాటను నిలబెట్టుకున్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్ధుల మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్ పేరిట ఓ లిస్ట్ను విడుదల చేశారు. డివిజన్లోని మొత్తం 45 డే అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఇందులో ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9,10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి ఉపకార వేతనాలు అందజేయనున్నారు. త్వరలోనే విద్యార్ధులకు స్కాలర్షిప్లు ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా విజయ్ మంచి మనసుకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications



