సమంతలాగే ఆ వ్యాధితో హీరో నరకం.. శరీరంలో అలాంటి మార్పులంటూ ఎమోషనల్
ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు తమ అనారోగ్యాలను బయటపెడుతూ కలకలం రేపుతున్నారు. అగ్రనటి సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధి బారినపడినట్లు కొన్నేళ్ల క్రితం బయటపెట్టి కన్నీటి పర్యంతమయ్యారు. అరుదైన ఆటో ఇమ్యూన్ రకానికి చెందిన మయోసైటిస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాని సామ్ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. స్వతహాగా నటీనటులు తమ కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు. అలాంటిది సమంత లాంటి స్టార్ హీరోయిన్ బయటపడటంతో చాలామంది తమ అనారోగ్య సమస్యలను వెల్లడించారు. తాజాగా సమంత తరహా ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. ఈ వివరాలు తెలియజేస్తూ ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
2009లో వెన్నిల కబడ్డీ కుజు అనే సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విష్ణు విశాల్.. ఆ తర్వాత భలే పాండ్యా, ద్రోహి, కుల్లనారి కూట్టమ్, నీర్పరవై, ముందసుపట్టి, జీవా, రాట్సాసన్ తదితర సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ రాణించారు. వెలైను వెందుట్ట వెల్లాయ్కారణ్, కథానాయగన్, సిలుక్కురువారుపట్టి సింగం, ఎఫ్ఐఆర్, గట్ట కుస్తీ, ఓ ఎంతాన్ బేబీ, ఆర్యన్ సినిమాలను నిర్మించారు విష్ణు విశాల్.

తొలుత తన క్లాస్మేట్ రజినీ నటరాజ్తో రిలేషన్లో ఉన్న విష్ణు విశాల్.. ఆమెను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆర్యన్ ఉన్నాడు. అయితే మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు అమ్మాయి గుత్వా జ్వాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2021 ఏప్రిల్ 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జ్వాలకు కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను 2005లో వివాహం చేసుకున్న గుత్త జ్వాల.. 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విష్ణు విశాల్- జ్వాల దంపతులకు కుమార్తె ఐరా సంతానం.
సినిమాలు చేస్తూ, భార్యాపిల్లలతో జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నారు విష్ణువిశాల్. ప్రస్తుతం గట్టా కుస్తీ 2లో విష్ణు విశాల్ నటించారు.. ఈ సినిమా తెలుగులో మట్టి కుస్తీ 2 పేరుతో విడుదల కానుంది. 2022లో వచ్చిన హిట్ మూవీ గట్టా కుస్తీకి సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించగా విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించారు. జూల్ 3న తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలాఉండగా.. ఎంతో యాక్టీవ్గా ఉండే విష్ణువిశాల్ ఇటీవల చాలా నీరసంగా కనిపించడంతో సినీ వర్గాలు, అభిమానులు ఆయన ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేయగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా దీనికి చెక్ పెడుతూ తన ఆరోగ్య సమస్యను బయటపెట్టారు విష్ణు విశాల్. నా ఆరోగ్యంపై, నా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇటీవల నా ముఖంలో, ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు మీరు గమనించారు. దీనికి కారణం ఆటో ఇమ్యూన్ కండీషన్. మూడు, నాలుగేళ్లుగా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నా. మందులు వాడుతూ చికిత్స తీసుకుంటున్నా.. దీని కారణంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ చుట్టుముట్టాయి. దాని ఫలితంగానే నా ముఖం అలిసిపోయినట్లుగా, నా శరీరంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితి దృష్ట్యా చికిత్సను కొనసాగించాల్సిందే, ఆరోగ్యానికే నా తొలి ప్రాధాన్యత అని విష్ణు అన్నారు.
గట్టా కుస్తీ 2 కోసం శ్రమించిన వారి కోసం ఈ పరిస్ధితుల్లోనూ ప్రమోషన్స్లో పాల్గొంటున్నా. త్వరలోనే నా ఆరోగ్యం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది. ప్రమోషన్స్ చివరి దశకు చేరుకున్నాయి.. జూలై 3న విడుదల కానున్న గట్టాకుస్తీ 2 మిమ్మల్ని అలరిస్తుందని ఆకాంక్షిస్తున్నానని విశాల్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుండగా.. విష్ణువిశాల్ కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



