ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ వద్దు.. ఆ గొప్ప కార్యం కోసం కోట్లు వదులుకొన్న యువ స్టార్ హీరో
ఇండస్ట్రీలో కొంతమంది నటులు రీల్ హీరో కాదు.. రియల్ హీరోలుగా నిలుస్తున్నారు. పలువురు సినీ స్టార్లు తమ ఆదాయంలో భాగాన్ని సమాజసేవకు వినియోగిస్తూ పేదలకు, అనాథలకు, చిన్నారులకు సాయం చేస్తున్నారు. అలాగే ఓ యంగ్ స్టార్ హీరో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్ మూవీ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ నుంచి వచ్చే రెమ్యూనరేషన్ లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ కోట్ల రూపాయాలను సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. "రీల్ హీరో కాదు.. రియల్ హీరో " అంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఇంతకీ ఏం చేశారు?
ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi). ఈ స్టార్ హీరో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఆయన టాలీవుడ్, మాలీవుడ్ లో కూడా సినిమాలు చేసారు. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న నటుడు వివేక్ ఒబెరాయ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అలా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "రామాయణం"లో కీలక పాత్రలో నటిస్తున్న వివేక్, తన మొత్తం రెమ్యునరేషన్ను సామాజిక సేవా కార్యక్రమానికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.

స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం'(Ramayana).ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా "కేజీఎఫ్" స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా 2026, 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ విభిషణుడి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వివేక్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ, "రామాయణం నిర్మాత నమిత్ మల్హోత్రాకు నేను ఈ సినిమాకు రెమ్యునరేషన్ వద్దు అని స్పష్టంగా చెప్పాను. ఆ మొత్తాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వండి అని కోరాను"అని చెప్పారు. తనకు ఈ ప్రాజెక్ట్ చాలా నచ్చిందని, దాని స్ఫూర్తిదాయకమైన భావన తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని తెలిపారు. "నాకు ఈ పాత్ర, ఈ ప్రాజెక్ట్ కంటే కూడా ముఖ్యమైంది. ఒక చిన్నారి ప్రాణం కాపాడటంలో భాగమవ్వడం. నా వంతు సాయం ద్వారా ఒక పిల్లవాడు నవ్వితే, అదే నాకు నిజమైన బహుమానం"అని వివేక్ చెప్పారు. వివేక్ దాతృత్వానికి అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అలాగే.. రామాయణం గురించి వివేక్ మాట్లాడుతూ, "రామాయణం పౌరాణికమా లేక చారిత్రాత్మకమా అనే దానిపై ఎప్పుడూ చర్చ జరుగుతుంది. కానీ మేము దీన్ని చారిత్రాత్మకంగా విశ్వసిస్తున్నాం. ఈ అద్భుతమైన కథలో భాగమవ్వడం నాకు గౌరవంగా ఉంది. యష్, రణ్బీర్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి ప్రతిభావంతుల తారాగణంతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. నాకు పాత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది " అని వివరించారు.
వివేక్ ఒబెరాయ్ ఇలా సహాయం చేయడం ఇది మొదటిసారి కాదు. వివేక్ ఇంతకు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన "ప్రాజెక్ట్ దేవి"అనే ఎన్జీఓను నడిపిస్తున్నారు. ఇది మహిళా సాధికారత, పిల్లల విద్య, వైద్య సాయం వంటి అంశాలపై పనిచేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ పిల్లలకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం ఆయన మానవత్వానికి మరో ఉదాహరణగా నిలిచింది. సినీ పరిశ్రమలో వివేక్ ఒబెరాయ్ వంటి మనసున్న నటులు ఉన్నంత వరకు "సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రేరణ కూడా" అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











