3 ఏళ్లలో 12 డిజాస్టర్లు.. 150 సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ హిట్టు కొట్టేనా?
సినిమా పరిశ్రమలో ప్రతీ ఏడాది అత్యధిక సినిమాల్లో నటించి అభిమానులు, ప్రేక్షకులకు చేరువ కావడమనే విషయాన్ని హీరోలు గతంలో సీరియస్గా తీసుకొనేవాళ్లు. ఈ తరం హీరోలు మాత్రం సంవత్సరానికి, లేదా రెండేళ్లకు ఒక సినిమా చేయడం హాబీగా మార్చుకొన్నారు. అయితే ఇలాంటి హీరోలకు అతీతంగా భిన్నంగా ఉండే స్టార్ అక్షయ్ కుమార్. సినిమా హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడం ఆయన నైజంగా మారింది. అలాంటి హీరోకు సంబంధించిన తాజా సినిమాలు, కెరీర్ గురించిన వివరాల్లోకి వెళితే..
కరాటే, కుంగ్ ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించిన రాజీవ్ హరి ఓం భాటియా చెఫ్గా అందరికి సుపరిచితుడు. సినిమాలపై ఇష్టం పెంచుకొన్న ఆయన చిన్న చిన్న పాత్రలు చేస్తూ హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 1987 సంవత్సరంలో ఆజ్ అనే సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి కెరీర్ పరంగా వెనక్కి చూసుకోలేని విధంగా తన కెరీర్ను మలుచుకొన్నారు.

బాలీవుడ్లో అతిథి పాత్రలతో మెల్లమెల్లగా హీరోగా మారిన ఆయన వరుసగా హిట్లు సాధించాడు. పలు హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేశాడు. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోగా పాపులారిటీని సాధించాడు. అంతేకాకుండా ఎక్కువగా ట్యాక్స్ కట్టే హీరోల్లో ఒకడిగా ఘనతను సాధించారు. కెనడా పౌరసత్వం కలిగిన ఆయన ఇటీవలే భారతీయ పౌరుడిగా మారారు.
హిందీ వినోద పరిశ్రమలో అక్షయ్ కుమార్ది సుమారుగా 40 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. గత 40 ఏళ్లలో దాదాపు 150 చిత్రాల్లో నటించారు. ఇంకా 10 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసే ఏకైక హీరోగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నాడు.

ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఖిలాడీ హీరోకు గత మూడేళ్లుగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. 2020 సంవత్సరం నుంచి పరిశీలిస్తే.. లక్ష్మీ, బెల్ బాటమ్, సూర్యవంశీ, అత్రంగీ రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కట్ పుత్లీ, రామ్ సేతు, యాక్షన్ హీరో, సెల్ఫీ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ మధ్య రిలీజైన ఓ మై గాడ్ 2 సినిమా హిట్ కావడంతో కాస్త ఊపిరి పీల్చుకొన్నట్లు అయింది. ఆ తర్వాత వచ్చిన మిషన్ రాణిగంజ్ సినిమా కూడా డిజాస్టర్గా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ్ కుమార్ నటించిన బడే మియా చోటే మియా సినిమా రిలీజ్కు సిద్దమవుతున్నది. టైగర్ ష్రాఫ్తో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రకుల్ ప్రీత్ సింగ్ భర్త, పాపులర్ నిర్మాతలు జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వసు భగ్నానీ, దీపిషిఖా దేశ్ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాంశు కిషన్ మెహ్రా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మనుషీ చిల్లర్, అలయ ఎఫ్ తదితరులు నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకొన్నారు. ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా? లేదా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











