యమదొంగ కథ ఎన్టీఆర్ కోసం రాయలేదా ?.. 19 ఏళ్ల తర్వాత బిగ్ సీక్రెట్ రివీల్!
టాలీవుడ్లో దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్కు ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా 2007లో విడుదలైన 'యమదొంగ'సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్టీఆర్లోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. యమదొంగ కథ అసలు జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసింది కాదని వెల్లడించారు. ఈ కథను మొదటగా సీనియర్ నటుడు మోహన్ బాబు కోసం రూపొందించానని ఆయన చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బయటకు వచ్చిన ఈ విషయం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

విజయేంద్ర ప్రసాద్ వివరించిన ప్రకారం.. ఈ కథకు మూలం పురాణాల్లోని స్వర్గం-నరకం సిద్ధాంతం. సాధారణంగా ఒక మనిషి చేసిన పాపం, పుణ్యాన్ని బట్టి ముందుగా స్వర్గానికా, నరకానికా పంపుతారనే భావన అందరికీ తెలిసిందే. అయితే ఒక వ్యక్తి పాపం, పుణ్యం రెండూ సమానంగా ఉంటే అతని పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన నుంచే 'యమదొంగ' కథ పుట్టిందని ఆయన తెలిపారు. ఆ కాన్సెప్ట్ను ఆసక్తికరంగా మలుస్తూ, పాపం-పుణ్యం సమానంగా ఉన్న వ్యక్తిని యముడు తిరిగి భూమికి పంపి, ఇంకా తప్పులు చేయమని అవకాశం ఇస్తాడనే పాయింట్తో కథను డెవలప్ చేసినట్టు చెప్పారు.
విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ కథను చాలా ఏళ్ల ముందే సిద్ధం చేసుకున్నారని, అప్పటికే రాజమౌళికి కూడా ఈ కథ గురించి తెలుసని చెప్పారు. ఒక రోజు రాజమౌళి స్వయంగా వచ్చి ఈ కథతో సినిమా చేద్దామని కోరాడని తెలిపారు. అయితే, అప్పటికి ఈ కథను మోహన్ బాబు కోసం ఊహించుకున్నానని తాను చెప్పానని గుర్తుచేసుకున్నారు. అయితే రాజమౌళి కథలో ఉన్న అవకాశాలను గుర్తించి, దానిని ఎన్టీఆర్ ఇమేజ్కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కథలో కొన్ని మార్పులు, పాత్రల రూపకల్పనలో కొన్ని సవరణలు చేసిన తర్వాత 'యమదొంగ'గా రూపొందిందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. హీరోగా ఎన్టీఆర్ నటించినప్పటికీ, మొదట కథ రాసుకున్న మోహన్ బాబుకే సినిమాలో యమధర్మరాజు పాత్రను అప్పగించారు. సినిమాలో మోహన్ బాబు పోషించిన యముడి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, ఎన్టీఆర్తో ఉన్న సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. కథ మొదట ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారో, చివరకు వారే సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించడం విశేషం.
యమదొంగ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో కూడా ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా కోసం ఆయన భారీగా బరువు తగ్గి స్లిమ్ లుక్లో కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది. యాక్షన్, కామెడీ, ఫాంటసీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబోలో వరుసగా వచ్చిన బ్లాక్బస్టర్గా నిలిచి, ఆ జోడీకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో 'యమదొంగ' గురించి అభిమానులకు మరో ఆసక్తికర కోణం తెలిసింది. ఒకవేళ ఈ సినిమా నిజంగానే మోహన్ బాబు హీరోగా తెరకెక్కి ఉంటే ఎలా ఉండేదనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. యమదొంగ ను తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోయే సినిమాగా నిలబెట్టాయి.


Click it and Unblock the Notifications




