Pawan Kalyan పొలిటికల్ ఎంట్రీ.. వారాహి విజయ యాత్రపై నటి ఆమని సెన్సేషనల్ కామెంట్స్
శుభలగ్నం, శుభ సంకల్పం లాంటి చిత్రాల్లో అద్బుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సీనియర్ నటి ఆమని బుధవారం అంటే జూన్ 14వ తేదీన అన్నవరంలోని సత్యదేవుడిని దర్శించుకొన్నారు. రత్నగిరిలోని స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నవరం ఆలయానికి రావడం ఇది రెండోసారి అని తెలిపారు. ఇంకా పవన్ కల్యాణ్ గురించి, వారాహి విజయ యాత్ర గురించి ఆమని మాట్లాడుతూ..
నారాయణ అండ్ కో అనే సినిమా షూటింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాం. మొత్తం యూనిట్ సభ్యులందరం సత్యదేవుడిని దర్శించుకోవాలని అనుకొన్నాం. నిర్మాత, దర్శకులు, హీరో, హీరోయిన్ అందరం కలిసి స్వామివారిని దర్శించుకొన్నాం. ఈ సినిమాలో నేను లీడ్ పాత్ర పోషిస్తున్నాను. పవన్ కల్యాణ్ ఈ ఆలయానికి వస్తున్నారని తెలిసి తొందరగా వచ్చి దర్శనం చేసుకొన్నాం అని ఆమని చెప్పారు.

మేము అన్నవరం ఆలయాన్ని సందర్శించుకొన్న రోజే పవన్ కల్యాణ్ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. గర్వంగా కూడా అనిపిస్తున్నది. నేను 8 ఏళ్ల తర్వాత నేను అన్నవరంకు వచ్చాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చాను. చాలా పవిత్రంగా ఉంది. మంచి ఫీలింగ్ కలిగింది అని ఆమని తెలిపారు.
పవన్ కల్యాణ్ గారు కూడా ఈ రోజే ఇక్కడికి వస్తున్నారని తెలిసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఆయన వారాహి విజయ యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అనుకోకుండా ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని సీనియర్ నటి ఆమని చెప్పారు.

సమాజానికి మంచి చేయాలనే ఉన్నత లక్ష్యంతో సినిమా రంగం నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రజలకు మంచి చేయాలనే పవన్ కల్యాణ్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన చేసే సేవకు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. పవన్ కల్యాణ్ వెరీ గ్రేట్ అని సీనియర్ నటి ఆమని అన్నారు.


Click it and Unblock the Notifications











