‘గబ్బర్ సింగ్ మూవీ వల్లే నా కూతురు జీవితం నాశనం.. అందుకే సినిమాలపై విరక్తి’
సినీ పరిశ్రమ వైకుంఠపాళి లాంటిది. ఎంత జాగ్రత్తగా ఉన్నా మధ్యలో పాము మింగేసి అమాంతం కిందకి లాగేస్తుంది. నిచ్చెనలు దొరకడం కష్టం.. దొరికినా నిలబెట్టుకోవడం అసాధ్యం. ఎప్పుడో ఒకసారి పాము నోట్లో పడక తప్పదు. ఈ రన్నింగ్ రేసులో ఎప్పుడూ పరిగెత్తేవాడే నిలబడతాడు. కష్టాలను అధిగమించి స్టార్లుగా వెలుగొందుతున్న వారు కొందరైతే, మధ్యలోనే రేసు నుంచి తప్పుకునేవారే ఎక్కువ. వరుస ఫ్లాప్లొచ్చి ఫేడ్ అవుట్ అయినవారు కొందరైతే.. క్యారెక్టర్లు నచ్చలేదనో, ఎవరో హర్ట్ చేశారనో ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నవారు మరికొందరు.
ఇదిలావుండగా.. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. పదేళ్లు గడిచి, పది సినిమాలు ఫ్లాప్ అయిన సమయంలో పవన్ ఫ్యాన్స్కు హిట్ రుచి చూపించింది ఈ సినిమా. అభిమానులు పవన్ కళ్యాణ్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఆయనను స్క్రీన్పై ప్రెజెంట్ చేశారు హరీష్ శంకర్. 2012 మే 11న సమ్మర్ కానుకగా రిలీజైన గబ్బర్ సింగ్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలు , డైలాగ్స్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది, నేను చెప్పినా ఒకటే.. నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే, నా తిక్క ఏంటో చూపిస్తా.. అందరి లెక్కలూ తేలుస్తా , కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు వంటి డైలాగ్స్ తూటాల్లా పేలాయి.

గబ్బర్ సింగ్లో పవన్ స్టైల్కు యూత్ ఫిదా అయిపోయారు. అల్లరి పోలీస్గా అల్లరి చేస్తూనే, విలన్ల అంతు చూసే పవర్ఫుల్ కాప్గానూ పవర్స్టార్ విశ్వరూపం చూపించారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ రీమేక్గా పేరొచ్చినప్పటికీ .. దానిని తెలుగు నెటివిటికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు హరీష్ శంకర్. వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్తో పాటు అప్పటికే ఐరన్ లెగ్గా ముద్రపడిన శృతిహాసన్ను లక్కీ హీరోయిన్గా మార్చింది. రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గబ్బర్ సింగ్ భారీ వసూళ్లను రాబట్టింది. 306 కేంద్రాల్లో 50 రోజులు, 65 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమై.. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్లో ఒకటిగా నిలిచింది.
తొలుత ఈ సినిమాను నాగబాబు అంజనా ప్రొడక్షన్లో నిర్మించాలనుకున్నారు, అయితే తీన్మార్తో నష్టాల్లో కూరుకుపోయిన తన వీరాభిమాని బండ్ల గణేష్తో చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. సినిమా హిట్ కావడంతో గణేశ్ ఆర్ధికంగా కోలుకున్నారు. గబ్బర్ సింగ్లో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరు కెరీర్లో మంచి స్థితికి చేరుకున్నారు. కానీ ఒక్కరు తప్ప.. అది ఎవరో కాదు అప్పూ అలియాస్ గాయత్రీ రావు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్లో అప్పూగా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఈమె తన నటనతో బాగా అలరించింది. తీసింది తక్కువ సినిమాలే అయినా హ్యాపీడేస్ రేంజ్లో సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లో అవకాశం రావడంతో గాయత్రి ఎగిరి గంతులేసింది. హీరోయిన్ శృతీహాసన్కు ఫ్రెండ్గా హారతి అనే రోల్లో పవన్కు సైట్ కొట్టే క్యారెక్టర్ అది. ఉన్నది కాసేపైనా గాయత్రీ నవ్వులు పూయించి.. సినిమా సక్సెస్ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. కానీ ఎందుకో గబ్బర్ సింగ్ తర్వాత కెరీర్ను ముగించింది.
అన్నట్లు గాయత్రీ రావుది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తల్లి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు పద్మ. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె కెరీర్ అర్థాంతరంగా ఆగిపోవడంపై పద్మ క్లారిటీ ఇచ్చారు. గబ్బర్ సింగ్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పారని, కానీ చివరికి అది ఫ్రెండ్ క్యారెక్టర్గా మారిందని తెలిపారు. ఇది గాయత్రీని డిజప్పాయింట్ చేసిందని, ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి బాగా చదువుకుని , 2019లో వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడిందని పద్మ తెలిపారు. ఒకరకంగా గబ్బర్ సింగ్ .. గాయత్రీకి హెల్ప్ చేసిందంటూ ఆమె థ్యాంక్స్ చెప్పారు.


Click it and Unblock the Notifications











