‘ఆ టార్చర్తో సూసైడ్ .. ఆడవాళ్లంటే అంతా చులకనా.. '
Actress Hema: తెలుగు సినీ పరిశ్రమలో నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తనదైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె, నేరుగా మాట్లాడే స్వభావం వల్ల తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె చెప్పే మాటలు, ఆమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు గురించి తన మనసులో నిండిన బాధను బయటపెట్టారు. ఒకప్పుడు అనేక కామెడీ పాత్రలతో, క్యారెక్టర్ రోల్స్తో ప్రేక్షకులను అలరించిన హేమ, ఈ కేసు తన జీవితాన్ని పూర్తిగా దెబ్బతీసిందని భావోద్వేగంగా వెల్లడించారు.
ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ, డ్రగ్స్ కేసు తన జీవితంలో ఎంతటి దెబ్బ కొట్టిందో గుర్తుచేసుకున్నారు. 'నేను చేయని పనికి ఆరోపణలు వచ్చాయి. ఒక్క వార్తతో నా జీవితాన్ని తారుమారు చేశారు. దాదాపు 18 నెలలు నరకం అనుభవించాను. బయటికి నవ్వుతూ తిరిగినా, లోపల ఎంత మంటపడ్డానో నాకు మాత్రమే తెలుసు' అని ఆమె చెప్పింది. ఈ కేసు మాత్రమే కాదు, ఆ కేసుకు సంబంధించిన మీడియా కథనాలే తనకు పెద్ద దెబ్బ అని చెప్పింది. " మీడియాలో నాపై వచ్చిన ఆరోపణలను పెద్దగా చూపించాయి. కానీ, నిజం వెలుగులోకి వచ్చినప్పుడు, నేను కేసు గెలిచినప్పుడు... ఎక్కడా వార్త రాలేదు'అని హేమ ఆవేదన వ్యక్తం చేశారు.

హేమ మీడియాపై తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. 'నా పేరు డ్రగ్స్ కేసులో లాగినప్పుడు, వాళ్లు మొదటి పేజీలా చూపించారు. నా గురించి లేనిపోని కథలు రాశారు. కానీ నేను కేసులో విజయం సాధించాక, ఒక్క స్క్రోలింగ్ కూడా పెట్టలేదు. ఒక చిన్న లైన్ కూడా రాయలేదు" అని హేమ మండిపడ్డారు. తాను ఈ విషయం గురించి మీడియా ఉద్యోగులతో మాట్లాడినప్పుడు మరింత ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చిందని చెప్పారు. 'నేను 'గ్రూప్లో పెట్టాను కదా నా క్లారిటీ' అనగా... 'మేం గ్రూపులు చూడం అండి' అన్నారు. గ్రూపులు చూడకపోతే, నా పార్టీ వీడియోలు మాత్రం ఎక్కడ చూసి వైరల్ చేశారు?'అని హేమ ప్రశ్నించారు.
తనపై వచ్చిన వదంతులు, నిర్ధారణ లేని కథనాలను గుర్తుచేసుకుంటూ హేమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "నా విషయానికి రాగానే ఎందుకు నిజాలు చెక్ చేయరు? ఆ ఆరోపణలు రాసిన ఛానల్కి కళ్లున్నాయా? వార్త రాయడం అంటే బాధ్యత' అని ఆమె మీడియా ధోరణిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసు సమయంలో తనకు మానసికంగా బలం ఇచ్చింది తన కుటుంబమే కాక, సినీ పరిశ్రమలో కొంతమంది కూడా అని హేమ పేర్కొన్నారు. 'నా కూతురు, నా అమ్మ... వాళ్లు లేకపోతే నేను బయటపడలేను. ఇండస్ట్రీలో కూడా నాకు సపోర్ట్ చేసిన వారు ఉన్నారు. నా పక్కన నిలబడ్డారు'అని తెలిపారు.
కేసు తర్వాత అవకాశాలు తగ్గిపోయాయా అన్న ప్రశ్నకు హేమ స్పష్టతనిచ్చారు. 'నిజం ఏంటంటే... నేను లాక్డౌన్ నుంచే సినిమాలు తగ్గించాను. పెద్ద పాత్రలు చేసి ఇప్పుడు చిన్నవి చేయడం నచ్చలేదు. అంతేకాక, నేను ఈవెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తాను. బిజినెస్ బాగా సాగుతోంది' అని చెప్పారు. అందువల్ల డ్రగ్స్ కేసు తమ కెరీర్ను ప్రభావితం చేసిందని అనుకోవడం తప్పు అని చెప్పారు. పార్టీ విషయంలో తనపై వచ్చిన విమర్శలకు హేమ స్పష్టంగా చెప్పారు. 'నేను ఏమి సుద్ధపూసనూ కాదు. పార్టీలకు వెళ్తాను, గుడికీ వెళ్తాను, బడికీ వెళ్తాను. నా ఇష్టం. పార్టీకి వెళ్తే తప్పు కాదు... డ్రగ్స్ తీసుకుంటే తప్పు'అని హేమ పేర్కొన్నారు.
అలాగే'సాక్ష్యాలు లేకుండా, రిపోర్ట్స్ లేకుండా నాపై ఆరోపణలు ఎలా చేస్తారు? ఇది ఏ విధమైన జర్నలిజం?' అని నిలదీశారు. సూసైడ్ చేయాలనిపించింది... కానీ అమ్మ, కూతురు గుర్తొచ్చారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఒత్తిడిని గుర్తుచేసుకుంటూ హేమ భావోద్వేగంతో మాట్లాడారు. 'నేను ప్రతి విషయాన్నీ ఎదుర్కొనే వ్యక్తిని. కానీ కొన్ని సందర్భాల్లో అంతకంతకు ఒత్తిడి పెరిగి... సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. కానీ నా అమ్మ, నా కూతురు గురించి ఆలోచించాను' అని చెప్పారు. 'ఆ సమయంలో నేను చనిపోతే... ఇదే మీడియా 'అవమానం తట్టుకోలేక చనిపోయింది' అని నా శవంపై కూడా కథలు రాసేది'అని హేమ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో హేమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.


Click it and Unblock the Notifications











