నమ్మిన వాళ్ళే మోసం చేశారు.. నటి హేమ షాకింగ్ కామెంట్స్..
తెలుగు సినీ పరిశ్రమలో నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హేమ, తన నేరుగా మాట్లాడే స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను భావోద్వేగంగా పంచుకున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసు కారణంగా తాను ఎదుర్కొన్న మానసిక వేదన, మీడియా వల్ల ఎదురైన నష్టం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ.. 'నేను చేయని పనికి నాపై ఆరోపణలు వచ్చాయి. ఒక్క వార్తతో నా జీవితం తారుమారు అయిపోయింది. దాదాపు 18 నెలలు నరకం అనుభవించాను. బయట నవ్వుతూ కనిపించినా, లోపల ఎంత మంటపడ్డానో నాకు మాత్రమే తెలుసు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు కంటే ఎక్కువగా, దానికి సంబంధించిన మీడియా కథనాలే తనకు పెద్ద దెబ్బ అని ఆమె స్పష్టం చేశారు. 'నాపై వచ్చిన ఆరోపణలను మీడియా పెద్దగా చూపించింది. కానీ, నేను కేసు నుంచి బయటపడ్డప్పుడు, గెలిచినప్పుడు మాత్రం ఎక్కడా వార్త రాలేదు'అంటూ వేదన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు హేమ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ప్రస్తుతం అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం హేమ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. రాజోలు వంటి చిన్న పట్టణం నుంచి మధ్యతరగతి నేపథ్యంతో వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని, కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదురైనా ఒక్కరోజు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని గుర్తు చేసుకున్నారు.
మీడియాపై మాట్లాడుతూ హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీడియా సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. 'హేమ అక్క తోపు' అని అనడానికి కారణం కూడా మీడియానే. కానీ కొన్ని మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ను విపరీతంగా వైరల్ చేశాయి. డ్రగ్స్ కేసులో నేను కేవలం నిందితురాలినే కానీ, నా కుటుంబాన్ని బయటికి లాగి, ఇష్టం వచ్చినట్లు కథనాలు వేశారు. ఆ తప్పుడు వార్తల వల్ల నా జీవితం, కెరీర్, కుటుంబ పరువు అన్నీ నాశనం అయ్యాయి'అని అన్నారు.
ఆ రోజుల్లో రోజుకు 100 నుంచి 200 కాల్స్ మీడియా నుంచి వచ్చేవని, కాల్ లిఫ్ట్ చేయకపోతే ఫేక్ న్యూస్ వేస్తారన్న భయంతో మాట్లాడాల్సి వచ్చేదని హేమ తెలిపారు. "ఇంట్లో కూర్చుని వీడియోలు చేసినా, వాటినీ వక్రీకరించి రాశారు. మనశ్శాంతి లేకుండా చేశారు. ఒక దశలో చనిపోవాలన్న ఆలోచన కూడా వచ్చింది" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ కలచివేశాయి.
చట్టపరమైన పరిమితుల వల్ల ఆ సమయంలో తన బాధను బయట చెప్పలేకపోయానని, బ్లడ్ టెస్టులు కూడా ఇవ్వకముందే నాపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను నమ్ముకున్న మీడియానే నాకు ద్రోహం చేసింది’ అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నటి హేమ చేసిన ఈ ఇంటర్వ్యూ, సెలబ్రిటీల జీవితాల్లో ఫేక్ న్యూస్ ఎంతటి నష్టం కలిగిస్తుందో మరోసారి చూపించింది. ప్రస్తుతం హేమ చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











