సీఎం ఆఫీస్లోనే కుట్ర? ముంబై నటి కేసులో సంచలనం.. వాగ్మూలంలో ఏం చెప్పిందంటే?
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఏకంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం దుమారం రేపింది. ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ను గత నెలలో పోలీసులు ఉత్తరాఖండ్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి జత్వానీ ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ వివరాల్లోకి వెళితే :
ముంబైకి చెందిన కాదంబరీ జత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు, పారిశ్రామికవేత్త విద్యాసాగర్ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. తనను పెళ్లి చేసుకోవాలంటూ కాదంబరి ఒత్తిడి చేయడంతో విద్యాసాగర్ ఆమెను వదిలించుకోవాలని చూసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందుకోసం నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దల సాయం తీసుకున్నాడని, వారి కనుసన్నల్లో పోలీసులు సైతం విద్యాసాగర్కు సహకరించినట్లుగా వార్తలు వచ్చాయి.

వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ముంబైలోనే ఉన్న కాదంబరీ.. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రాగానే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విషయాన్ని సీరియస్గా తీసుకుని ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరిపిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో నాడు విజయవాడలో విధులు నిర్వర్తించిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా , తెర వెనుక మంత్రాంగం నడిపిన వ్యక్తిగా వైసీపీ నేత పేరు వినిపిస్తోంది. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఈ కేసుపై కాదంబరీ జత్వానీ ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. శనివారం విజయవాడ వచ్చిన ముంబై నటి.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

తనను తప్పుడు కేసులో ఇరికించి, బెదిరించాలనే కుట్రకు నాటి సీఎం కార్యాలయంలోనే పడిందని ఆమె ఆరోపించారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే అప్పటి డీసీపీ విశాల్ గున్నీ టీమ్ ముంబైకి చేరుకుందని తనను, తన తల్లిదండ్రులను అరెస్ట్ చేశారని జత్వానీ చెప్పారు. కస్టడీలో మహిళా పోలీసులెవ్వరూ లేరని, అర్థరాత్రి 12 గంటల వరకు మగ అధికారులే తనను విచారించారని ఆమె తెలిపారు. పెళ్లి చేసుకోనని చెప్పడంతోనే విద్యాసాగర్ కక్షగట్టి ఇలా చేశాడని జత్వానీ ఆరోపించారు.
తన ఫోన్ను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు తనను ఫాలో అయ్యారని ఆమె పేర్కొన్నారు. కాదంబరీ జత్వానీ తాజా వాంగ్మూలం నేపథ్యంలో మరింత మందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తెలుగులోని ప్రధాన మీడియా ఛానెల్స్ ఈ విషయాన్ని బయటపెట్టాయి. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో అనే దానిపై ఆసక్తి నెలకొన్నది.


Click it and Unblock the Notifications











