జీవితంలో అలాంటి పెద్ద తప్పు చేశా.. ఇప్పటికీ బాధపడుతున్నా- లయ
తెలుగు సినీ పరిశ్రమలో గ్లామర్కు అతీతంగా, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లలో లయ (Laya) ఒకరు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆమె, ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ తర్వాత వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తాను వదులుకున్న, కోల్పోయిన అవకాశాలు, రీఎంట్రీ ప్రయాణం గురించి ప్రస్తవించారు. అయితే.. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిందనీ, అదే తన జీవితం చేసిన పెద్ద తప్పు అని లయ చెప్పడం సినీ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏ సినిమా ఏంటీ? ఆ పాత్ర?
నటి లయ.. సినీ ప్రయాణం బాలనటిగా ప్రారంభమైంది. ఆ తర్వాత స్వయంవరం చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించారు. సహజమైన అందం, అమాయకమైన అభినయం, కుటుంబ కథలకు సరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్తో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆ తర్వాత ప్రేమించు, హనుమాన్ జంక్షన్, శివరామరాజు, మనసున్న మారాజు, అదిరిందయ్యా చంద్రం వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. తెలుగు మాత్రమే కాదు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అయితే.. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో వివాహం చేసుకున్న లయ, తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం కారణంగా సినిమాలకు దూరమయ్యారు. అయితే నటనపై ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదని ఆమె పలుమార్లు చెప్పారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించడం అభిమానులను సంతోషపరిచింది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అక్క పాత్రలో భావోద్వేగభరిత నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా పెద్ద విజయం సాధించకపోయినా, లయ నటనకు మంచి స్పందన వచ్చింది.
తాజా ఓ ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి అరవింద సమేత వీరరాఘవ సినిమాలో జగపతి బాబు భార్య పాత్ర కోసం తనను సంప్రదించారని చెప్పారు. అయితే అది చిన్న పాత్ర అనుకుని కథను పూర్తిగా వినకుండానే తిరస్కరించానని వెల్లడించారు. 'సినిమా చూసిన తర్వాత ఆ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థమైంది. అప్పుడు నేను చాలా పెద్ద తప్పు చేశానని అనిపించింది' అంటూ లయ అన్నారు. ఆ పాత్రను ఈశ్వరీ రావు అద్భుతంగా పోషించారని ప్రశంసించారు. 'నేను చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది' అని కూడా చెప్పారు.
ప్రస్తుతం లయ వయస్సుకు తగ్గ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే ఫ్యామిలీ థ్రిల్లర్లో కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే బుల్లి తెరపై కూడా సందడి చేస్తుంది. మ్యాడ్ ఫర్ ఇచ్ ఆధర్ అనే రియాలిటీ షోలో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా ఒకప్పుడు వెండితెరపై వెలిగిన లయ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పాలి.


Click it and Unblock the Notifications



