తిరుపతి లడ్డుపై హీరోయిన్ అనుచిత వ్యాఖ్యలు.. మా కర్మ.. మా దరిద్రం అంటూ..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇటీవల ఏర్పడిన వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో తయారయ్యే లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలతో ఈ అంశం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూపై టాలీవుడ్ నటి మాధవి లత (Madhavi Latha)చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీసాయి. ఇంతకీ ఏమన్నారంటే?
టాలీవుడ్ నటి మాధవీలత (Madhavi Latha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. ఈ సమయంలో సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సూటిగా మాట్లాడే స్వభావం ఉన్న మాధవీలత తాజాగా తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూపై కామెంట్స్ చేసింది. తిరుమల కళ్యాణోత్సవ లడ్డూల గురించి ఆమె సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

తిరుమల నుంచి వచ్చిన లడ్డూలను ఎంతో భక్తితో స్వీకరించానని చెప్పిన మాధవీలత, వాటి రుచి మాత్రం తాను ఆశించిన విధంగా లేదని పేర్కొన్నారు. లడ్డూ చాలా గట్టిగా ఉందని, సాధారణంగా ఉండే నెయ్యి సువాసన కూడా ఎక్కువగా కనిపించలేదని తెలిపారు. అలాగే చక్కెర పరిమాణం ఎక్కువగా అనిపించిందని, పచ్చ కర్పూరం వాసన కూడా ఎక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. డ్రైఫ్రూట్స్ మాత్రం బాగానే ఉన్నప్పటికీ మొత్తం రుచి మాత్రం తాను ఆశించిన స్థాయిలో లేదని వెల్లడించారు.
అంతేకాకుండా 'మా కర్మ, మా దరిద్రం... అంత ధనవంతుడైన శ్రీవారికి లడ్డూ రుచి లేకపోవడం మా దౌర్భాగ్యం' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. తాను హిందువని, తన కులదైవం వెంకన్న స్వామి అని మాధవీలత స్పష్టం చేశారు. భక్తిగా మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించానని, ప్రసాదం నాణ్యత గురించి మాట్లాడటం తప్పు కాదని ఆమె పేర్కొన్నారు. గత డిసెంబర్లో తిన్న చిన్న లడ్డూ చాలా రుచిగా ఉందని, కానీ తాజాగా అందుకున్న కళ్యాణోత్సవ లడ్డూ మాత్రం రాయిలా గట్టిగా అనిపించిందని సోషల్ మీడియాలో వెల్లడించారు.
మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం శ్రీవారి ప్రసాదం గురించి ఇలా మాట్లాడటం సరైంది కాదని విమర్శిస్తున్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదం రాజకీయ రంగు దాల్చి వైసీపీ, కూటమి వర్గాల మధ్య రాజకీయ ఆరోపణల వేడి కొనసాగుతోంది. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించడంతో ఈ అంశం మరింత పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా మాధవీలత కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
మాధవీలతకు వివాదాలు కొత్తేమి కాదు.. గతంలో ఆమె షిర్డి సాయి బాబాపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా దేవుడు కాదని, ఆయనను హిందువులు పూజించడం ఎందుకని ప్రశ్నించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొందరు భక్తులు సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ వ్యాఖ్యలను వైరల్ చేసిన సుమారు 14 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై మాధవీలత మాట్లాడుతూ.. తాను కేవలం చరిత్రలో ఉన్న విషయాలనే చెప్పానని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











