ఇండస్ట్రీలో అమ్మాయిలకి నరకమే.. ఆఫర్ రావాలంటే , రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్
మలయాల చిత్ర పరిశ్రమలోని దుస్థితిపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోయిన్లు, మహిళా నటులు తమ జీవితంలో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. హేమ కమిటీ లాంటి కమీషన్ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉండాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాదు.. కొందరు కొత్త హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న అవమానాలను కూడా ఈ సందర్భంగా పంచుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాలను పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే :
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగువారిని పలకరించారు రకుల్ ప్రీత్ సింగ్ .. ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ షార్ట్ గ్యాప్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు ఈ పంజాబీ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, కార్తీ వంటి స్టార్స్తో నటించే అవకాశం ఆమెకు త్వరగానే దక్కింది. టాలీవుడ్లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్, బాలీవుడ్లలోనూ ఛాన్స్లు పట్టేసింది రకుల్. సినిమాల్లో నటిస్తూనే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తోంది.

అయితే ఇటీవలి కాలంలో హిందీలో ఆమె నటించిన సినిమాలు ఒకటి ఆరా తప్పించి చాలా వరకు నిరాశ పరిచాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు. అయినప్పటికీ అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే తాము పెళ్లి పీటలెక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడితో ఏడాడుగులు వేసింది.
అయితే తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవమానాలు ఎదుర్కొనట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్ హీరోగా దరశథ్ తెరకెక్కించిన మిస్టర్ పర్ఫెక్ట్లో తొలుత తనను హీరోయిన్గా ఎంపిక చేసి ఓ షెడ్యూల్ సైతం పూర్తి చేశారని .. ఇది ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లిన నేను చదువులో మునిగిపోయానని రకుల్ తెలిపారు. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న తనకు.. నా ప్లేస్లో కాజల్ను తీసుకున్నారని తెలిసిందని ఆమె చెప్పారు.

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల పరిస్ధితి దారుణంగా ఉంటుందని, ఇలాంటి అవమానాలు మామూలేనని రకుల్ ప్రీత్ అన్నారు. తన కెరీర్లో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్ధితి ఎదురైందని.. కానీ మనకంటూ ఓ రోజు వస్తుందని ఎదురుచూస్తుంటానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రకుల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ .. హిందీలో దే దే ప్యార్ దే 2లో నటిస్తున్నారు. అన్షుల్ శర్మ దీనికి దర్శకుడు కాగా వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. రెండ్రోజుల క్రితం 34వ పుట్టినరోజుని గ్రాండ్గా జరుపుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు.


Click it and Unblock the Notifications











