Renu Desai: ఒక్క మగాడు రేప్ చేస్తే.. మగవాళ్లందరిని చంపేయాలా? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి రేణు దేశాయ్ (Renu Desai) తాజాగా షాకింగ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. వీధి శునకాల అంశంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల మధ్య రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు రాజకీయ, న్యాయ, సామాజిక వర్గాల్లో వేడెక్కిన చర్చకు దారితీశాయి. వీధి కుక్కలను నిర్మూలించాలనే చర్యలను రేణూ దేశాయ్ తీవ్రంగా ఖండిస్తూ.. ఇది మానవత్వానికి విరుద్ధమని స్పష్టం చేశారు.
ప్రెస్మీట్లో రేణూ దేశాయ్ మాట్లాడుతూ, 'ఒక కుక్క కాటు వల్ల మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు... రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, దోమకాట్ల వల్ల జరిగే మరణాలపై ఎందుకు స్పందించడం లేదు?' అని ప్రశ్నించారు. రోజుకు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, వాటి గురించి ఎందుకు ఇంత తీవ్ర చర్యలు ఉండవని ఆమె నిలదీశారు. ప్రజాభద్రత పేరుతో మూగజీవులపై మాత్రమే దాడి చేయడం ద్వంద్వ నైతికత కాదా అని మండిపడ్డారు.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలను పెద్ద సంఖ్యలో చంపిన ఘటనలను ప్రస్తావిస్తూ, 'ఒక కుక్క తప్పుగా ప్రవర్తిస్తే, దానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలి. అంతేగానీ వందల కుక్కలను చంపడం అమానుషం' అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనను ఉదాహరణగా చూపుతూ, గ్రామ పంచాయతీ సర్పంచి వందల కుక్కలను చంపడం మానవత్వానికి మచ్చగా అభివర్ణించారు. 'కుక్కలవి ప్రాణాలు కావా? కుక్కే కాదు... ఆవు, గేదె, పిల్లి, కోతి... అన్ని జీవాలకు బతికే హక్కు ఉంది' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వీధి కుక్కల సంఖ్య పెరగడానికి అసలు కారణం అపరిశుభ్రతేనని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. ఇంటా బయట చెత్త పేరుకుపోవడం, సరైన వ్యర్థ నిర్వహణ లేకపోవడం వల్లే కుక్కలు పెరుగుతున్నాయని చెప్పారు. 'ఈ సమస్యలకు కారణమైన వ్యవస్థలు ఎవరూ ప్రశ్నించరు. కానీ మూగజీవులను మాత్రమే టార్గెట్ చేస్తారు... ఇది ఎక్కడి న్యాయం?' అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జంతువులను బలిచేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదకరంగా ప్రవర్తించే కొద్దిమంది కుక్కలను మాత్రమే గుర్తించి జంతు సంక్షేమ సంస్థలకు అప్పగించాలి తప్ప, సామూహిక హత్యలకు దిగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
రేణూ దేశాయ్ తన ప్రసంగంలో సుప్రీంకోర్టు తీర్పుపై కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. 'న్యాయం అనే మాటే జోక్ అయిపోయింది. ఈ తీర్పు మానవత్వంతో ఇచ్చినట్లు అనిపించడం లేదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇలా మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేసినా భయపడను. ఇది మూగజీవుల ప్రాణాలకు సంబంధించిన విషయం' అని స్పష్టం చేశారు. దోమకాట్ల వల్ల చిన్నపిల్లలు చనిపోతున్నారని, వాటిని అరికట్టేందుకు ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తాను ప్రతిరోజూ వందల కుక్కలకు సేవలు అందిస్తానని, తన ఇంట్లోనూ అనేక కుక్కలు ఉన్నప్పటికీ ఎప్పుడూ కాటు ఘటన జరగలేదు. ఒక్కరిద్దరు మగాళ్లు రేప్, మానభంగం చేస్తే.. అందరి మగాళ్లను చంపేయాలా? అని రేణూ దేశాయ్ రేణు దేశాయ్ ప్రశ్నించారు.
అన్ని వీధి కుక్కలు ప్రమాదకరమనే భావన పూర్తిగా తప్పని, కొద్ది శాతం మాత్రమే సమస్యగా ఉంటాయని చెప్పారు. వాటిని గుర్తించి శాస్త్రీయంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే.. ఈ విషయంపై మాట్లాడితే.. తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మూగజీవులపై కాకుండా సమస్యల మూలాలపై దృష్టి పెట్టాలని ఆమె చేసిన పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.


Click it and Unblock the Notifications











