ఇక డాక్టర్ సాయిపల్లవి .. ఎంబీబీఎస్ పట్టా అందుకొన్న అందాల భామ.. (వీడియో)
చిత్ర పరిశ్రమలో డాక్టర్ కాకుండా యాక్టర్ అయినవాళ్లు ఎందరో ఉన్నారు వీరిలో సాయిపల్లవి ఒకరు. తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారామె. అందాల ఆరబోతకు దూరంగా కేవలం కథాబలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ .. తాను అందరి లాంటి అమ్మాయిని కాదని సాయిపల్లవి నిరూపించారు. గ్లామర్ షోకు దూరంగా ఉన్నా ఆఫర్లే ఈమెను వెతుక్కుంటూ వెళ్తాయి. ఎన్ని షరతులు పెట్టినా సాయిపల్లవి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడంలో అతిశయోక్తి లేదు. లేడీ సూపర్స్టార్ అని ఎంతో మంది హీరోయిన్లను పిలిచినా, లేడీ పవర్స్టార్ అనే బిరుదు దక్కించుకున్న ఏకైక నటీమణి సాయిపల్లవే.
సాయిపల్లవి నటిగా కంటే తొలుత డ్యాన్సర్. విజయ్ టీవీలోని ఉంగలిల్ యార్ అడుత ప్రభుదేవా అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈటీవీలో ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్గా నిలిచారు. తన డ్యాన్సింగ్ స్కిల్స్తో అందరినీ ఆకట్టుకుని ఢీ 4 షోలో టైటిల్ గెలిచిన వెంటనే తమిళ్ ప్రేమమ్లో అతిథి పాత్రలో కనిపించారు. ఈ నేపథ్యంలో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా'లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు సాయిపల్లవి. ఈ చిత్రంలో భానుమతి పాత్రలో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించిన పల్లవి హీరో వరుణ్ తేజ్నే డామినేట్ చేసేసింది.

ఏళ్లకు ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇతర భాషల అమ్మాయిలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అరుదు అలాంటిది సాయిపల్లవి తన తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. అదీ తెలంగాణ యాసలో కావడం విశేషం. తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ఆ వెంటనే ఎంసీఏ, పడి పడి లేచే హృదయం, విరాట పర్వం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
తమిళంలో ధనుష్ సరసన నటించిన మారి 2తో సాయిపల్లవి పేరు దేశం మొత్తం మారుమోగింది. ఇందులోని రౌడీ బేబీ సాంగ్ ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్ను మరోసారి బయటపెట్టింది. గ్లామర్ షోకు దూరంగా సెలక్టివ్ రోల్స్, సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో నవయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్, హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న రామాయణ్ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. సీతమ్మ తల్లి గెటప్లో సాయిపల్లవి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సోషల్ మీడియాకు , మీడియాకు దూరంగా ఉండే సాయిపల్లవికి సంబంధించిన విషయాలు బయటకు రావడం బహుఅరుదు. అయితే తాజాగా జార్జియాలోని తాను మెడిసిన్ చదువుకున్న టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డేకు సాయిపల్లవి హాజరయ్యారు. తనతో పాటు చదువుకున్న మిత్రులను, అధ్యాపకులను ఆమె పలకరించారు. అనంతరం వేదికపై డాక్టర్ పట్టాను అందుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సాయిపల్లవి ఇంత వరకు ఎంబీబీఎస్ పట్టా ఎందుకు అందుకోలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











