విడాకుల వివాదం ఓ వైపు.. మరోవైపు తల్లి నీదే భారం అంటూ సమంత పూజలు
తెలంగాణలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంలో సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంతల పేర్లను తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడం దుమారం రేపింది. సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలను ఆయన నాశనం చేశారని.. ఈ విషయం సినీ పెద్దలకు కూడా తెలుసునని సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై స్వయంగా సమంత, నాగచైతన్య, అక్కినేని నాగార్జున స్పందించారు. ఈ ఇష్యూతో బాగా డిస్ట్రబ్ అయిన సమంత ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బాపూఘాట్లో జాతిపితకు నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి కొన్ని అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఆమె అక్కడితో ఆగిపోతే ఏ సమస్యా ఉండేది కాదు.. కానీ ఈ వివాదంలోకి సమంత - నాగచైతన్య విడాకులను ప్రస్తావించడంతో తెలుగు సినీ, రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ జంట విడిపోవడం వెనుక కేటీఆర్ ఉన్నరన్న అర్ధమొచ్చేలా సురేఖ మాట్లాడారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అటు సినీ పరిశ్రమ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. నాగార్జున, నాగచైతన్య, సమంత, జూనియర్ ఎన్టీఆర్, నాని, రామ్ గోపాల్ వర్మ, వెంకటేష్ , కోన వెంకట్ సహా పలువురు ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. విడాకులు మా వ్యక్తిగత విషయమని.. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని సామ్, చైతూలు వేర్వేరు పోస్టులలో స్పష్టం చేశారు. మా కుటుంబం పట్ల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని అక్కినేని నాగార్జున డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన ఏకంగా సురేఖపై పరువు నష్టం దావా వేయడం మరింత దుమారం రేపింది.
కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి నుంచి సమంత పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. విడాకుల తర్వాత తన సినిమాలు, తన జీవితం, తనదైన లోకంలో బతుకుతున్నారు సమంత. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. లోపల భరించలేనంత బాధ ఉందని అర్ధమవుతూనే ఉంది. చైతన్య నిశ్చితార్ధం గురించి తెలుసుకున్న సామ్ ఎలా రియాక్ట్ అవుతారోనని జనాలు భావించారు. కానీ ఆమె యథావిధిగా తన పనుల్లో తాను బిజీగా ఉంటున్నారు.
ఇలాంటి దశలో కొండా సురేఖ సీన్లోకి వచ్చి మానుతున్న గాయాన్ని మళ్లీ కెలికనట్లయ్యింది. ఈ వరుస పరిణామాలతో డిస్ట్రబ్ అయిన సమంత ఆధ్యాత్మిక బాటపట్టారు. చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో గడుపుతున్నారు సామ్. మనసు బాగోనప్పుడు అక్కడికి వెళ్లి రీఛార్జ్ అవుతుంటారు. నిన్నటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో సమంత ఆశ్రమానికి చేరుకుని లింగ భైరవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











