తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్ దారుణ ఓటమి.. నెటిజన్లు మరీ నీచంగా ట్రోలింగ్
కేంద్రంలో అధికారంలోకి ఎవరొస్తారు.. మోడీ హ్యాట్రిక్ కొడతారా.. రాహుల్ మ్యాజిక్ చేస్తారా అంటూ దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోక్సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి స్వల్ప మెజారిటీ సాధించగా.. ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది.
భారతదేశంలో రాజకీయాలు, సినీ పరిశ్రమది విడదీయరాని అనుబంధం కాబట్టి.. ఈసారి కూడా లోక్సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పలువురు సినీతారలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వీరిలో నవనీత్ కౌర్ రానా ఒకరు. మహారాష్ట్రలో అమరావతికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆమె ఈసారి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నవనీత్పై కాంగ్రెస్ అభ్యర్ధి బల్వంత్ వాంఖడే 19,731 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మిగిలిన తారల సంగతి ఏమో కానీ జాతీయ స్థాయిలో నవనీత్ కౌర్ ఓటమి చర్చనీయాంశమైంది.

తెలుగులో శీను వాసంతి లక్ష్మీ , శత్రువు, మహారథి, యమదొంగ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో అంతగా కలిసి రాకపోవడంతో కోలీవుడ్ వైపు ఫోకస్ పెట్టారు. కానీ సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ఈ క్రమంలో ఓ యోగా క్యాంపులో రాజకీయ నాయకుడైన రవి రాణాతో పరిచయం ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. వీరిద్దరూ ప్రేమలో పడి 2011లో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సమక్షంలో వివాహం చేసుకున్నారు. నాటి నుంచి భర్త అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోనూ ఓనమాలు నేర్చుకున్నారు. అప్పటికే రవి రాణా బద్నేరా నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్గా విజయం సాధించారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి నుంచి ఎన్సీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు నవనీత్ కౌర్. నాటి ఎన్నికల్లో శివసేన అభ్యర్ధిగా పోటీ చేసిన ఆనందరావు అడ్సుల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సూత్రంతో పరాజయానికి కృంగిపోకుండా అమరావతి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసి మన్ననలు పొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన నవనీత్ కౌర్ శివసేన అభ్యర్ధి ఆనందరావ్ అడ్సుల్పై భారీ మెజారిటీతో గెలుపొంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
పార్లమెంట్ సమావేశాల్లో తన వాగ్థాటి, విషయ పరిజ్ఞానంతో వాడి వేడి ప్రసంగాలు చేసి ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీకి గట్టి మద్ధతుదారైన నవనీత్ కౌర్.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాషాయ కండువా కప్పుకుని అమరావతి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. 5 లక్షల పైచీలుకు ఓట్లు సాధించి .. ఒకానొక దశలో తన గెలుపు ఖాయమని నవనీత్ భావించారు. కానీ ప్రహర్ జనశక్తి పార్టీ అభ్యర్ధి దినేష్ గణేష్దాస్ భారీగా ఓట్లను చీల్చడంతో ఆమె ఓటమి పాలయ్యారు.
ఇదిలావుండగా.. నవనీత్ కౌర్ గతంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. హిందుస్థాన్లో ఉండాలనుకుంటే , జై శ్రీరామ్ అనాల్సిందేనని లేకుంటే పాకిస్తాన్కు వెళ్లాల్సిందేనంటూ నవనీత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపడమే గాక పోలీస్ కేసుల వరకు వెళ్లింది. తాజా ఓటమి నేపథ్యంలో ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొందరు వీటిని ఎడిట్ చేసి ఓడిపోయిన తర్వాత బాధపడుతున్న నవనీత్ కౌర్ను ఆమె భర్త ఓదారుస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. మరికొందరైతే ఫలితాల తర్వాత మోడీ జైశ్రీరామ్కు బదులుగా, జై జగన్నాథ్ అన్న వీడియోను షేర్ చేస్తూ.. మోడీని పాకిస్తాన్కు వెళ్లమని చెప్పండి మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్పై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











