‘ఆ హీరోయిన్లకి హెడ్ వెయిట్.. విజయశాంతి అలా నా నోరు మూయించింది’
చిత్ర పరిశ్రమలో బాలనటిగా కెరీర్ ప్రారంభించి.. స్టార్ హీరోయిన్లుగా, నటులుగా నిలిచిన వారు ఎందరో ఉన్నారు. ఈ కోవలకే వస్తారు బేబీ వరలక్ష్మీ. 1973లోనే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మీ దాదాపు 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో నటించారు. బాలనటిగానే కాకుండా స్టార్ హీరోలకు చెల్లెలిగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ నటించి మెప్పించారు. కెరీర్ పీక్స్లో ఉన్న దశలో వ్యక్తిగత కారణాలతో వెండితెరకు దూరమయ్యారు. ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మీ తన కెరీర్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో బాలనటులకు తక్కువ పారితోషికాలు ఉండేవి. కానీ మేం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నామని అనుకునేవాళ్లు. మేం తీసుకునే పారితోషికాలు మా స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కావు. మా నాన్న స్కూల్ ఫీజులు కట్టడానికి ఎంతో ఇబ్బందిపడేవారు. అయితే కొంచెం పెద్దయి చెల్లెలి పాత్రలు చేశాక పారితోషికాలు పెరగడంతో పరిస్ధితులు చక్కబడ్డాయి. ఉన్నదానిలో మంచిగా సంపాదించి సంతోషంగానే ఉన్నామని వరలక్ష్మీ చెప్పారు.
అప్పట్లో కేరవాన్లు ఉండేవి కావు.. నటీనటులమంతా చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్లం, కలిసి భోజనాలు చేసేవాళ్లం. చిరంజీవిగారు చాలా జాలీగా ఉండేవారు. మా మోడ్యూలేషన్స్ కూడా కరెక్ట్ చేసేవాళ్లు. వెంకటేష్ గారికి 4 సినిమాలు చేశా.. ఆయన ఎక్కువ మాట్లాడేవాళ్లు కాదు, తన పని తాను చూసుకునేవాళ్లు. హీరోయిన్లలో విజయశాంతి గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. రాధ, జూహ్లీ చావ్లా, రజినీ వాళ్లు కూడా క్లోజ్గా ఉండేవాళ్లు. హీరో ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ కాబట్టి... హీరోయిన్లకు స్కోప్ తక్కువగా ఉండేది, మాతో తక్కువగా మాట్లాడేవారు. కొంతమంది హీరోయిన్లు హెడ్ వెయిట్ చూపించేవాళ్లు.. నేను సాఫ్ట్గా వెళ్లిపోతాను కాబట్టి, నాతో అందరూ బాగుండేవాళ్లు అని వరలక్ష్మీ గుర్తుచేసుకున్నారు.

కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం తప్పని నాకు తెలియదు. పెద్ద పెద్ద వాళ్ల ముందు అలాగే కూర్చొనేదానిని. అప్పుడు విజయశాంతి గారు చెప్పారు.. బాలకృష్ణ గారు, కృష్ణగారు వస్తున్నారు కాలు మీద కాలు వేసుకోవద్దు తీసి లేచి నిలబడమని చెప్పేవారు. చిన్నపిల్లని వాళ్ల ముందు అలా కూర్చోకూడదని, లేచి నిలబడాలని నాకు తెలియదు. కానీ విజయశాంతి గారు మాత్రం ఎలా ఫ్రెండ్లీగా ఉండాలో నేర్పించారు. అయితే ఎన్నిసార్లని లేచి నిలబడాలి? వాళ్లు షాట్కి వచ్చినప్పుడల్లా కాలు మీద కాలు తీయలేం కదా. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు లేస్తాం.. ఇంకెందుకు కూర్చోవడం నిలబడే ఉంటానని మొండిగా చెప్పేదానిని. ఎన్నిసార్లయినా సరే.. పెద్దవాళ్లు వచ్చినప్పుడు లేవాలని విజయశాంతి నాకు వివరంగా చెప్పి ఎలా ఉండాలో నేర్పించారు అని వరలక్ష్మీ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ గారితో నటించాలంటే భయం.. ఆయన అటు వస్తుంటే, ఇటు పారిపోయేదానిని. నాగేశ్వరరావు గారు ఎప్పుడూ సరదాగా ఉండేవారు. చిన్నపిల్లలంటే చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆయనతో చిన్నపిల్లగానూ చేశాను, అదే టైంలో కలెక్టర్ గారి అబ్బాయిలో ఆయనకి కూతురిగానూ చేశాను. ఈ జనరేషన్లో మహానటి సావిత్రిగారితో నటించే అవకాశం నాకు దక్కింది. దేవుడు మావయ్య సినిమాలో ఆమెతో కలిసి నటించా.. అప్పటికే ఆవిడ బాగా వీక్ అయిపోయారు. అప్పుడు చిన్నపిల్లని కాబట్టి నాకు సావిత్రి గారు ఎవరు? ఏంటీ? అనేది తెలిసేది కాదు. సావిత్రి గారు.. సావిత్రి గారు అని పిలిచేవాళ్లు.. నేను చూస్తూ ఉండేదానిని. ఆవిడ పిక్చర్స్ మనం చూడాలన్నా మనకి టీవీలు ఉండేవి కావు. ఎక్కడో ఒక చోట ఒక టీవీ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే సావిత్రిగారితో చేశానని చాలా ఆనందంగా ఉంటుందని వరలక్ష్మీ చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications

















