రూ. 4 కోట్ల పన్ను వివాదం.. ఐశ్వర రాయ్ కేసులో సంచలన తీర్పు.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టిన ఐశ్వర్య, తన గ్లామర్, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. వరుస విజయాలను అందుకుని ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే. గత కొంతకాలంగా ఈ భామ ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉంటున్నారు. కానీ, వ్యక్తిగత కారణాలతో తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రూ. 4 కోట్ల పన్ను వివాదంలో ఐశ్వర రాయ్ వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఐశ్వర్యరాయ్ బచ్చన్ బాలీవుడ్కి మాత్రమే కాకుండా భారతీయ సినీ ప్రపంచానికి ఒక అందమైన గుర్తింపుగా నిలిచారు. ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ఊహాగానాలు వచ్చినా, అభిమానుల మనసుల్లో ఆమె స్థానం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఇటీవల ఓ పన్ను వివాదంలో ఐశ్వర్య చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్కు ఆదాయపు పన్ను శాఖతో ఉన్న వివాదంలో ఊరట లభించింది. సుమారు రూ.4 కోట్లకు పైగా ఉన్న పన్ను కేసులో ముంబై ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించినది. ఐశ్వర్య తన ఐటీ రిటర్న్స్లో మొత్తం ఆదాయాన్ని రూ.39.33 కోట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఐశ్యర్య రాయ్ పన్ను మినహాయింపు ఉన్న ఆదాయం కోసం పెట్టిన ఖర్చుల కింద స్వయంగా రూ. 49 లక్షలు డిస్అలౌ ( మినహియింపు) చేసింది. అయితే, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆమె లెక్కలతో ఏకీభవించకుండా, నిబంధనలకు విరుద్ధంగా రూ. 4.60 కోట్లను డిస్అలౌ చేశారు. దీంతో ఐశ్వర్య రాయ్ పై అదనంగా రూ.4.11 కోట్ల పన్ను భారం పడింది.
దీంతో ఐశ్వర్య రాయ్ ముందుగా కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ (అప్పీల్స్) వద్ద, ఆ తరువాత ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) వద్ద సవాలు చేశారు. కేసును విచారించిన ట్రైబ్యునల్, అసెసింగ్ ఆఫీసర్ (AO) నిర్ణయంలో పలు లోపాలను గుర్తించింది. ఐశ్వర్య స్వయంగా పేర్కొన్న డిస్అలౌవెన్స్ను తిరస్కరించడానికి సరైన కారణాలు రికార్డులో నమోదు చేయలేదని స్పష్టంగా పేర్కొంది. నిబంధనల ప్రకారం, రూల్ 8Dని వర్తింపజేయడానికి ముందు అసెసింగ్ ఆఫీసర్ తన అసంతృప్తిని రికార్డులో నమోదు చేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పును ట్రైబ్యునల్ గుర్తుచేసింది.
ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఐశ్వర్య తన లెక్కల్లో చూపిన మొత్తం ఖర్చులు రూ. 2.48 కోట్లు మాత్రమే కాగా, అధికారులు లెక్కించిన డిస్అలౌవెన్స్ రూ.4.60 కోట్లుగా ఉంది. అంటే మొత్తం ఖర్చుల కంటే ఎక్కువగా డిస్అలౌవెన్స్ నిర్ణయించడం అసంభవమని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఐటీ అధికారి విధించిన రూ.4.11 కోట్ల అదనపు పన్నును రద్దు చేస్తూ, ఐశ్వర్య స్వయంగా ప్రకటించిన రూ. 49 లక్షల డిస్అలౌవెన్స్ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
అక్టోబర్ 31న వెలువడిన ఈ తీర్పు సెక్షన్ 14A కింద వచ్చే ఇలాంటి పన్ను వివాదాలపై ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తుందని పన్ను నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో ఐశ్వర్యకు భారీ ఉపశమనం లభించింది. అంతే కాకుండా, పన్ను లెక్కలలో పారదర్శకత, సాక్ష్యాధారాలు ఎంత ముఖ్యమో కూడా మరోసారి స్పష్టమైంది. ఈ నిర్ణయం కేవలం ఐశ్వర్యకు మాత్రమే కాదు, ఇలాంటి పన్ను వివాదాలలో చిక్కుకున్న ఇతర పన్ను చెల్లింపుదారులకు కూడా దిశానిర్దేశం చేస్తుందని వారు పేర్కొన్నారు. మొత్తంగా, ఐశ్వర్యరాయ్ బచ్చన్కు ఇదొక ఘన విజయమని చెప్పాలి.


Click it and Unblock the Notifications











