ఒకే గదిలో 50 మందితో .. నొప్పిని భరించా, నేషనల్ క్రష్ బోల్డ్ కామెంట్స్
జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వారికి ఆ స్థానం ఊరకనే దక్కలేదు. దాని వెనుక ఎంతో శ్రమ, కఠోర సాధన, కష్టాలు, కన్నీళ్లు ఖచ్చితంగా ఉంటాయి. అభిమానులు ఇలవేల్పుల్లా కొలిచే నటీనటులు కూడా స్టార్స్ కాకముందు పస్తులున్న వారే. ఎన్నో కలలతో కన్నవారిని, ఆత్మీయులను, పుట్టిన ఊరిని వదిలి వచ్చి తెలియని ప్రాంతంలో .. పరిచయం లేని మనుషులతో గడపాల్సి ఉంటుంది. అవకాశాలు దక్కక, తిరిగి వెళ్లలేక రాలిపోయిన తారలెన్నో. ఈ నేపథ్యంలోనే కెరీర్ తొలినాళ్లలో పడిన ఇబ్బందులను పంచుకున్నారు నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి. ఆ వివరాల్లోకి వెళితే..
చిత్ర పరిశ్రమలో స్టార్ కావాలంటే గుమ్మడికాయంత టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసొస్తుందో ఎవరికీ తెలియదు, ఒక్క ఛాన్స్ చాలు ఓవర్నైట్ స్టార్ అయిపోవడానికి. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తి దిమ్రి. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్లో జోయాగా కనిపించిన తృప్తి స్టార్ హీరోయిన్గా మారిపోయారు.

ముఖ్యంగా రణబీర్తో కలిసి చేసిన బెడ్రూమ్ సీన్స్ తృప్తికి మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు, బంధువులను ఆమె ఎలా ఫేస్ చేస్తుందోనని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. నిజానికి ఏడెనిమిదేళ్ల కిందటే పోస్టర్ బాయ్స్తో ప్రారంభమైంది తృప్తి కెరీర్. కానీ జనానికి ఆమె గురించి తెలియడానికి యానిమల్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక్క దెబ్బతో సోషల్ మీడియాలోనూ తృప్తి దిమ్రికీ అభిమానులు భారీగా పెరిగిపోయారు.
యానిమల్ తర్వాత అభిమానులు ఆమెను నేషనల్ క్రష్గా పిలవడం మొదలుపెట్టారు. అలాగే తృప్తికి వరుసపెట్టి అవకాశాలు క్యూ కడుతున్నాయి. విక్కి విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలాయా 3, ధడక్లలో ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం మోడల్ సామ్ మర్చంట్తో తృప్తి డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కథనాలను బట్టి ఈ జంట 2017 నుంచి సన్నిహితంగా ఉంటున్నారట. త్వరలోనే అఫీషియల్గా తమ బంధాన్ని కన్ఫర్మ్ చేసి, త్వరగా పెళ్లి పీటలెక్కాలని నెటిజన్లు ఈ జంటను కోరుతున్నారు.

ఇదిలాఉండగా... బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న తృప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తృప్తి వెల్లడించారు. ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారని.. కానీ తానే ధైర్యం చేసి ముంబైకి వచ్చానని, ఇక్కడ ఒకే గదిలో దాదాపు 50 మందితో కలిసి నివసించానని తృప్తి తెలిపారు.
ప్రతిరోజూ అవకాశాల కోసం ప్రయత్నించానని.. అవకాశాలు లేక బాధపడ్డానని, అయినప్పటికీ తల్లిదండ్రుల వద్దకు తిగిరి వెళ్లకూడదని నొప్పిని భరించానని దిమ్రీ చెప్పారు. ఈ సమయంలో బంధువులు , స్థానికులు రాబందుల్లా తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పారని .. నాకు పెళ్లి కాదని, ఎవరూ ముందుకు రారని నూరిపోశారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇలాంటి దశలో లైలా మజ్నులో ఛాన్స్ దక్కడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారని తృప్తి దిమ్రీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తృప్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











